టీ త‌మ్ముళ్ల‌కు బాబు భేటీ...కొత్త‌గా ఏం లేద‌ట‌

Update: 2017-12-08 16:35 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు - ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్టీఆర్‌ భవన్‌ లో తెలుగుదేశం తెలంగాణ పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు - కేంద్ర కమిటీ సభ్యులు - ఉపాధ్యక్షులు - ప్రధాన కార్యదర్శులు - అధికార ప్రతినిధులు - జిల్లా అధ్యక్షులు - అనుంబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు. అయితే బాబు భేటీపై తెలుగు త‌మ్ముళ్ల‌లోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఎందుకంటే...ష‌రామాములుగా సాగిన చంద్ర‌బాబు ప్ర‌సంగ‌మ‌ని చెప్తున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ గురించి ఆస‌క్తి వ్యాఖ్య‌లు ఒక్క‌టే..రోటీన్‌ కు భిన్న‌మంటున్నారు.

ఎప్ప‌ట్లాగే...ఈ స‌మావేశంలో కూడా సీఎం చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో హైద‌రాబాద్ గురించి  ప్ర‌సంగించ‌డం త‌మ్ముళ్ల‌లో బోర్ వచ్చేందుకు కార‌ణ‌మ‌యింద‌ని తెలుస్తోంది. అయితే ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన జీఈఎస్ గురించి చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. 13 సంవత్సరాలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనులే ఇప్పటికీ కన్పిస్తున్నాయని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు గుర్తు చేశారు. హైదరాబాద్‌ లో హైటెక్ సిటీ - ట్యాంక్‌ బండ్‌ - బుద్ధవిగ్రహం - హెచ్‌ ఐసీసీ - శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ - రింగ్‌ రోడ్‌ - వంటి పనులు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసినవి - ప్రారంభించినవే కనబడుతున్నాయని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన  హెచ్‌ ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమావేశం జరిగిందని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌కు గుర్తు చేయ‌డం గ‌మ‌నార్హం. `జీఈఎస్ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్‌ కూతురు ఇవాంకతో పాటు వచ్చిన ప్రపంచ పారిశ్రామికవేత్తలు మనం వేసిన రోడ్లపైనే తిరిగారు. ఈ స‌మావేశం సందర్బంగా సోషల్‌ మీడియా అంతా టీడీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల చుట్టే తిరిగింది.` అంటూ చంద్ర‌బాబు చెప్తుండ‌టంతో...చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో ఉన్నా...ఆయ‌న మన‌సంతా...హైద‌రాబాద్ పైనే ఉంద‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం.

ఈ సందర్భంగా ఎప్ప‌ట్లాగే...రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై చర్చించి నాయకుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రతి గురువారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు టెలికాన్ఫరెన్స్‌ తీసుకుంటానని - నెలకొకసారి పార్టీ చేసిన కార్యక్రమాలను సమీక్ష చేస్తానని - పార్టీ అభివృద్ధి కోసం పూర్తిగా సహకరిస్తానని చంద్ర‌బాబు ఈ సమావేశంలో తెలియజేశారు. పార్టీ నాయకులు ప్రతిరోజు ఎన్టీఆర్‌ భవన్‌ కు రావాలని ఆదేశించారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పార్టీ ఆఫీసుకు వచ్చే వాడినని ఈ సందర్భంగా నాయకులకు చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అలా పనిచేయడం వలనే తిరిగి అధికారంలోకి రాగలిగామని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలకు సంఘీభావం తెలుపుతూ సమస్యలపై పోరాటం చేస్తూ ముందుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Tags:    

Similar News