ప్ర‌జ‌ల్లో సంతృప్తి..త‌మ్ముళ్ల‌కు బాబుపై అసంతృప్తి

Update: 2018-05-03 12:34 GMT
ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త‌న‌ అధ్యక్షతన నిర్వ‌హించిన‌ సమన్వయ కమిటీ సమావేశంలో చేసిన కామెంట్ల‌పై పార్టీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌ జరుగుతోంది. మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ స‌మావేశంలో టీడీపీ గురించి సానుకూల వ్యాఖ్య‌లు చేస్తూ త‌మ్ముళ్ల‌కు బీపీ పెంచే కామెంట్లు చేశార‌ని అంటున్నారు. ప్రజల్లో సంతృప్తి మార్చిలో 67% వస్తే - ఏప్రిల్ లో 73% వచ్చిందని - మన అభివృద్ధి - హక్కుల కోసం పోరాటం వల్లే సంతృప్తి పెరిగిందని చంద్ర‌బాబు తెలిపారు. అయితే ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు ముఖ్యంగా ప్ర‌జాప్ర‌తినిధుల సంతృప్తిని దూరం చేసే కామెంట్లు చేశార‌ని అంటున్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ గెలిచేలా కార్యాచరణ చేపట్టాలని చంద్ర‌బాబు ఆదేశించారు. పార్టీ నాయకులందరూ ఒకే మాటమీద నిలబడి, ఒకే బాటలో నడవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో మనం గెలవాలని, మీ తప్పులను నా మీద వేసుకోవడానికి సిద్ధంగా లేనని, మన ప్రతి చర్యకు ప్రజల్లో ప్రతిచర్య ఉంటుందని, ఎక్కడా తప్పు జరగరాదని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ విష‌యంలో భ‌రోసా ఇవ్వ‌లేన‌ని చెప్ప‌క‌నే చెప్పారు. కాగా, చంద్ర‌బాబు ఈ కామెంట్లు చేయ‌డం వెనుక ప‌లు స‌ర్వేల్లో ఆయ‌న‌కు వ‌చ్చిన స‌మాచారామే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌తిప‌క్షాలు స‌హా ఇటీవలి కాలంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం తెలుగుదేశం ప్ర‌భుత్వంలో అవినీతి పెరిగిపోతోంద‌ని, ఎమ్మెల్యేలు విచ్చ‌ల‌విడిగా దండుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో వివిధ రూపాల్లో చంద్ర‌బాబు స‌ర్వేలు నిర్వ‌హించినట్లు స‌మాచారం. ఈ స‌మాచారాన్ని క్రోడీకరించ‌గా అనేక‌మందిపై తీవ్ర‌మైన అసంతృఫ్తి స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని అంటున్నారు. అందుకే ఈ హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్లు పేర్కొంటున్నారు. కొద్దికాలం క్రితం వ‌ర‌కు సిట్టింగ్‌ల‌కు తాను భ‌రోసా అని వెల్ల‌డించిన చంద్ర‌బాబు తాజాగా ఈ హెచ్చ‌రిక‌తో ఆ మాటను నిల‌బెట్టుకోన‌ని స్ప‌ష్టం చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది

ఇదిలాఉండ‌గా...ఈ సంద‌ర్భంగా పార్టీకి సంబంధించిన అంశాల‌పై కూడా చంద్ర‌బాబు చ‌ర్చించారు. బీజేపీ లాలూచీ రాజకీయాలకు కర్నాటక ఎన్నికలే నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు. కుడి, ఎడమ అవినీతిపరులను పెట్టుకుని... బీజేపీ నాయకులు ప్రజలకు ఏరకమైన సందేశం ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం గనులను కొల్లగొట్టిన మైనింగ్‌ మాఫీయా గాలి జనార్దన్‌రెడ్డిపై ఉన్న కేసులను కూడా కేంద్ర ప్రభుత్వం తొలగిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తిరుపతి సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లో కూడా ధర్మపోరాట సభల నిర్వహణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో నిర్వహించే భారీ ర్యాలీతో ధర్మపోరాట సభలను ముగించాలని, ఈ సభలను ఎన్నికల ప్రచారానికి వేదికలుగా ఉపయోగించుకోవాలని చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు సూచించారు.
Tags:    

Similar News