ప్రత్యేక హోదాపై కేంద్రానికి తాజా అల్టిమేటం

Update: 2015-07-26 04:48 GMT
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. విభజన చట్టంలోని అంశాల్ని అమలు చేయాలని.. విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రత్యేక హోదా ప్రకటన ద్వారా సాయం చేయాలన్న డిమాండ్లతో ఏపీలో రాజకీయ పోరాటం మొదలు కానుందా? అంటే అవుననే చెబుతున్నారు.

ఇప్పటివరకూ ఏపీ ప్రత్యేక హోదా మీద జరిగిన పోరాటం తూతూమంత్రంగానే సాగిందని.. ఇకపై అలా జరగకూడదన్నట్లుగా ఏపీ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఏపీ ప్రత్యేక హోదా పై పోరాటం చేయాలన్న నిర్ణయాన్ని వామపక్షాలు తీసుకోవటం చూసినప్పుడు రానున్న రోజుల్లో ఛంద్రబాబుకు పరిపాలన సాగించటం ఇబ్బందికరంగా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ దిశగా అడుగులు పడ్డాయి. ఆగస్టు 10 లోపు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనను కేంద్రం వెల్లడించాలని.. లేనిపక్షంలో ఆగస్టు 11న ఏపీ బంద్ కు పిలుపు ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఒక అల్టిమేటం కేంద్రానికి జారీ చేశారు.

ఇంతకాలం చూసిచూడనట్లుగా వ్యవహరించిన ఏపీకి ప్రత్యేకహోదా అంశం రానున్న రోజుల్లో ప్రముఖంగా మారనుందని చెబుతున్నారు. ఈ అంశం చుట్టూ ఏపీ ప్రజలు భావోద్వేగానికి గురి కావటం ఖాయమని.. రాజకీయంగా బలపడేందుకు.. ఏపీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకునేందుకు ప్రత్యేక హోదా అంశం సాయం చేస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే.. ప్రత్యేక హోదా విషయంలో రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలు జరగటం ఖాయంగా చెబుతున్నారు. మరి.. ఆగస్టు 10 లోపు ప్రత్యేక హోదా ప్రకటనను మోడీ సర్కారు చేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News