మీడియా సంస్థ‌ల‌కు 10ల‌క్ష‌లు ఫైన్..ఎందుకంటే?

Update: 2018-04-18 10:27 GMT
పోటీ త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌ని మీడియా జోరుకు ఫైన్ తో షాకిచ్చింది ఢిల్లీ హైకోర్టు. సంచ‌ల‌నం అంటే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా  వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌లు మీడియా సంస్థ‌లు కొన్ని త‌ప్పుల మీద త‌ప్పులు చేసేస్తున్నాయి. తాజాగా అలాంటి త‌ప్పుల‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది.

జ‌మ్ముక‌శ్మీర్ లోని క‌థువాలో దారుణ అత్యాచారానికి.. ఆపై హ‌త్య‌కు గురైన ఎనిమిదేళ్ల బాలిక ఉదంతంలో మీడియా ప్ర‌ద‌ర్శించిన అత్యుత్సాహంపై జ‌రిమానా కొర‌డాను ఝుళిపించింది. మీడియాలో ఆ పాప పేరు.. ఫోటోలు ప‌బ్లిష్ చేసినందుకు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

ఫోటోలు ప‌బ్లిష్ చేసిన మీడియా సంస్థ‌ల‌కు రూ.10ల‌క్ష‌ల జ‌రిమానాను విధించిన కోర్టు.. ఆ మొత్తాన్ని బాధితురాలి ప‌రిహార నిధికి పంపాల‌ని ఆదేశించింది. బాధితురాలు మైన‌ర్ కావ‌టం.. ఆమె వివ‌రాల్ని బ‌య‌ట‌పెట్ట‌కూడ‌దు. అలా చేయ‌టం నేరం. కానీ.. కొన్ని ప‌త్రిక‌లు.. ఛాన‌ళ్లు ఆ పాప ఫోటోను ప్ర‌ముఖంగా వెల్ల‌డించాయి. ఈ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన హైకోర్టు.. ఆ బాధితురాలి వివ‌రాలు బ‌య‌ట‌పెట్టిన వారికి ఆర్నెల్ల వ‌ర‌కూ జైలుశిక్ష విధించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించిన త‌దుప‌రి వాయిదాను ఏప్రిల్ 25కు వాయిదా వేసింది. ఈ జ‌న‌వ‌రిలో క‌థువాలోని ర‌సానా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక‌ను బంధించి.. మ‌త్తుప‌దార్థాలు ఇచ్చి కిరాత‌కంగా అత్యాచారం చేసి.. దారుణంగా హింస‌కు గురి చేసి హ‌త్య చేసి అడ‌విలో ప‌డేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ ఎనిమిది మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఉదంతం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. మైన‌ర్ బాధితురాలి ఫోటోలు ప్ర‌చురించే అవ‌కాశం లేకున్నా.. ప‌లు మీడియా సంస్థ‌లు త‌మ ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటేశాయి.
Tags:    

Similar News