డీమార్ట్ జోరుకు బ్రేకులు పడ్డాయి.. ఈసారి లాభాలు తగ్గాయెందుకు?

Update: 2022-01-10 03:05 GMT
ఏ టైంలో చూసినా.. కిటకిటలాడే డీమార్టులు కొత్తేం కాదు. మహానగరాల్లో.. ఆ తర్వాత పట్టణాలకు విస్తరించిన డీమార్టుకు తిరుగులేదన్నట్లుగా దూసుకెళ్లటం తెలిసిందే. అయితే.. ఈ జోరుకు ఈసారికి బ్రేకులు పడినట్లుగా కంపెనీ వెల్లడించిన క్యూ3 వివరాలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే.. ఈ త్రైమాసికంలో కంపెనీ లాభాలు తగ్గినట్లుగా చెబుతున్నారు. అధిక ద్రవ్యోల్భణం సామాన్యుల తాట తీస్తున్న వేళ.. డీమార్ట్ మీదా ప్రభావం చూపించిన వైనం ఆసక్తికరంగా మారింది. అక్టోబరు-డిసెంబరు మధ్య మూడు నెలల్లో అంచనాల కంటే తక్కువ లాభాల్ని నమోదు చేసినట్లుగా తాజాగా విడుదల చేసిన ఫలితాలు చెబుతున్నాయి.

స్టాక్ ఏక్సైంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్ లో కంపెనీ నికరలాభం 32 శాతం పెరిగి రూ.552.53 కోట్లకు చేరుకుంది. అయితే.. బ్లూమ్ బర్గ్ మాత్రం డీమార్టు క్యూ3 లాభాల్ని రూ.603 కోట్లుగా అంచనా వేశారు. అంటే.. అనుకున్న దాని కంటే దాదాపు రూ.50 కోట్ల మేర లాభాలు తగ్గాయి. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ.446.05 కోట్లను గడించింది. ఈ గణాంకాలతో పోలిస్తే.. ఈసారి లాభాలు పెరిగినట్లు కనిపించినా.. అనుకున్నంత మాత్రం రాణించకపోవటం గమనార్హం.

దీనికి కారణం నిర్వహణ ఆదాయం పెరగటం.. మొత్తం వ్యయాలు కూడా కారణంగా తేల్చారు. అమ్మకాల మీద ద్రవ్యోల్బణం ప్రభావం చూసినట్లుగా డీమార్టు చెబుతోంది. సాధారణ వస్తువులు.. దుస్తుల వ్యాపారం స్థిరంగా ఉందని.. ఎఫ్ఎంసీజీ వస్తువుల అమ్మకాలు తగ్గటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. నిత్యవసర వస్తువులను కొనుగోలు చేసే విషయంలో ప్రజలు పొదుపును పాటిస్తున్నట్లుగా గుర్తించారు. వీటిల్లో తగ్గిన అమ్మకాలు.. కంపెనీ అనుకున్నంత లాభాల్ని గణించే విషయంలో వెనుకబడినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News