గుజ‌రాత్‌ను మించిన ఎన్నిక‌ల పోరు.. ఎక్క‌డో తెలుసా?

Update: 2022-12-03 08:21 GMT
ఇప్పుడు దేశం మొత్తం గుజ‌రాత్‌వైపు చూస్తోంది. ఎందుకంటే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రం.. పైగా ఇక్క‌డ 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుందా?  రాదా? అనే టెన్ష‌న్ ఒక‌వైపు సాగుతోంది. గుజ‌రాత్ సఅసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలి ద‌శ పోలింగ్ ముగిసిపోయింది. మ‌లి ద‌శ ఈ నెల 5న జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనికంటే కూడా.. రాజ‌కీయ పార్టీల్లో న‌రాలు తెగే ఉత్కంఠ‌కు గురి చేస్తున్న మ‌రో ఎన్నిక ఉంది.

అదే.. ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌లు.. బీజేపీకి, కాంగ్రెస్‌కు, అదేవిధంగా ఢిల్లీ పాలిత  ఆమ్ ఆద్మీపార్టీకి సంబంధించి ప్రాణ ప్ర‌దంగా మారిపోయాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పొడ‌ను కూడా గిట్ట‌నివ్వ‌బోమ‌ని చెబుతున్న బీజేపీకి, బీజేపీకి ఆప్ బీ టీం అని  చెబుతున్న కాంగ్రెస్‌కు కూడా... ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిపోయాయి. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డమే ధ్యేయంగా ఇవి ప‌నిచేస్తున్నాయి.

అంతేకాదు.. త‌ద్వారా .. మ‌రో రెండేళ్ల‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిష్ట‌వేయాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఏకంగా కేంద్ర మంత్రులు ఇత‌ర రాష్ట్రాల్లోని బీజేపీ పాలిత ముఖ్య‌మంత్రులు సైతం ఇక్క‌డ ప్ర‌చారం చేశారు. ఆదివారం(ఈ నెల 4) ఇక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మేనిఫెస్టో అంటే అర్ధం చేసుకోవ‌చ్చు. కానీ, ఢిల్లీ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ మూడు పార్టీలూ మేనిఫెస్టోల‌ను వండివార్చాయి.

ఎంత‌గా హామీలు గుప్పించాయంటే.. ఉచితాల‌కు తాము దూర‌మ‌ని ప‌దే ప‌దే చెబుతున్న బీజేపీ నాయ‌కులు ఢిల్లీలో గెలిస్తే.. ఏటా నాలుగు వంట గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. విద్యుత్ బిల్లుల్లో 50 శాతం రాయితీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు, బ్యాట‌రీ కార్లు కొనుగోలు చేసేవారికి తొలి రెండు ఈ ఎంఐలు తామే చెల్లిస్తామ‌ని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతోనే స‌రికాదు.. మొహుల్లా ఆసుప‌త్రుల‌ను(ఆప్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌వి) మ‌రింత నాణ్యంగా తీర్చిదిద్దుతామ‌ని బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించారు.

ఇక‌, కాంగ్రెస్ కూడా దాదాపు ఇలాంటిహామీలే గుప్పించింది. ఆప్ 20 లీట‌ర్ల నీటిని ఇంటికి ఉచితంగా ఇస్తే.. తాము 50 లీట‌ర్ల నీటి ని ఇస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. విద్యుత్ రాయితీల‌ను 70 శాతంచేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ ప‌రిణామాల‌తోనే ఢిల్లీ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను మించిపోయాయి. దాదాపు 30 వేల మంది పోలీసులు.. 50 వేల మంది పారామిలిట‌రీ సిబ్బంది కాపు కాస్తున్నారంటే.. ఈ ఎన్నిక‌ల‌ను ఆయా పార్టీలు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయో అర్ధం చేసుకోవ‌చ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News