కవితలో మరో షిండేను చూశారా... బీజేపీ ప్లాన్ నిజమేనా...?

Update: 2022-11-19 03:53 GMT
కల్వకుంట కవిత. కేసీఆర్  కుమార్తె. తెలంగాణా ఉద్యమం నుంచి చురుకుగా ఉన్న మహిళా నాయకురాలు. ఎంపీగా గెలిచి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న లీడర్. ఒక విధంగా ఫైర్ బ్రాండ్ అని చెప్పాలి. ఆమె రాజకీయ జీవితం మొత్తం కేసీఆర్  చుట్టూ అల్లుకుని ఉంది. సరే ఆమెకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లభిస్తుందో లేదో అది ఆమె స్వవిషయం.

ఎండ్ ఆఫ్ ది డే చూస్తే  ఎంటైర్ కల్వకుంట  ఫ్యామిలీ ఒక్కటే అవుతారు. రాజకీయాలు ఎంత కుటుంబంలో ప్రవేశించినా విడిపోయే సీన్ ఉండదు. అది కూడా కేసీఆర్   పెద్దగా టీఆర్ఎస్  కి ఉండగా కలలో కూడా జరగదు. ఇది సింపుల్ లాజిక్. ఇది తెలిసి కూడా కవిత దగ్గరకు వెళ్ళి ఆమెను బీజేపీలో చేరమని కోరే వాళ్ళు ఉన్నారూ అంటే వారికి రాజకీయం ఎంతవరకూ తెలుసు అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న.

ఆమెలో షిండేను చూడాలనుకున్న వారు రక్తబంధం ఎంత చిక్కదో తెలియకపోవడమే చిత్రం. మహారాష్ట్రలో షిండే అయితే బయట వ్యక్తి. కాబట్టి సులువుగా గేలం వేయగలిగారు. కానీ ఇక్కడ కవిత కేరాఫ్ కేసీఆర్  వన్ అండ్ ఓన్లీ డాటర్. ఆ ట్యాగ్ లైన్ తోనే ఆమె రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్  సైతం రాజకీయ చాణక్యుడు.

ఇలా ఏ వైపు చూసినా గులాబీ తోట దుర్భేధ్యమైన కోట. కానీ అధికారం పొరలు కమ్ముకున్న తరువాత  ఒక రాయి వేస్తే తప్పేంటి అని ట్రై చేసి ఉండొచ్చేమో. నిజానికి అయితే రాజకీయం తెలిసిన వారు ఎవరూ చేయరు. కానీ స్వయంగా కవిత మీడియా ముందుకు వచ్చి తనను బీజేపీ వారు సంప్రదించిన మాట వాస్తవమే అని చెబుతున్నారు అంటే మ్యాటర్ సీరియస్ అనే అనుకోవాలి.

అయితే అలా సంప్రదించిన నేతలు ఎవరూ తెర వెనక ఉన్న పెద్దాయన ఎవరు అన్నదే ఇపుడు కీలకమైన ప్రశ్న. నిజానికి కవిత లాంటి బిగ్ షాట్ ని తమ వైపు తిప్పుకోవాలీ అంటే ఆషామాషీగా ఆ వ్యవహరం సాగదు, తెర ముందు ఎవరున్నా తెర వెనక మాత్రం గండర గండలే ఉంటారు. మరి వారు ఎవరు తెర ముందుకు వచ్చిన వారు ఎవరు. ఈ విషయాలు తెలియాలి.

ఈ మధ్యనే జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశంలో కేసీఆర్ తన సొంత కూతురునే బీజేపీ వారి చేర్చుకోవడానికి చూశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  రోజులు గడవకముందే అదే నిజమని కవిత చెప్పారు. అంటే దీని మీద నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. అయితే  టీఆర్ఎస్  అయినా ముందుకు వచ్చి దర్యాప్తు చేయించాలి. లేకపోతే తమ మీద బురద జల్లినందుకు బీజేపీ వారు అయినా అసలు వాస్తవాలు బయటపెట్టాలి.

లేకపోతే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించినట్లుగా ఇది టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ డ్రామా అని కూడా జనాలు అనుకునే వీలు ఉంది. ఏది ఏమైనా కవిత ప్రకటన మాత్రం తెలంగాణా రాజకీయాలలో  సంచలనం రేపుతోంది. ఇంతకీ ఆ బీజేపీ నేత ఎవరు. ఇపుడు ఇదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News