పోలీసులకు హైకోర్టు షాక్.. నలుగురికి 4 వారాల జైలు శిక్ష!

Update: 2022-06-06 14:43 GMT
ఎరక్కపోయి ఇరుక్కున్నారు పోలీసులు. భూములు, భార్యభర్తలు లాంటి సివిల్ వివాదాల్లో తలదూర్చి కోరి తలకొరివి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇరుక్కుపోవాల్సి వచ్చింది.  అనవసరంగా ఓ భార్యభర్తల వివాదంలో ఇరుక్కొని ఇప్పుడు ఏకంగా జైలు శిక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని కీలకమైన అధికారులు ఇలా 4 వారాల పాటు జైలు శిక్షను పడడం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. నలుగురు పోలీస్ అధికారులకు 4 వారాల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ కు ఈ జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది.

భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని.. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసు ఇవ్వలేదని వారిపై అభియోగాలు దాఖలయ్యాయి.

దంపతుల కేసులో సుప్రీం ఆదేశాలు అధికారులు ధిక్కరించినట్లు కోర్టు తేల్చింది. అయితే ప్రస్తుతం వేసిన శిక్షపై అప్పీల్ కు వెళ్లేందుకు వెసులుబాటును కల్పించింది కోర్టు. ఆరువారాల పాటు శిక్షను నిలిపివేసింది తెలంగాణ హైకోర్టు.

విచారణ చేపట్టిన హైకోర్టు వీరికి 4 వారాలు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నలుగురిపై శాఖాపరమైన క్రమశిక్షణ తీసుకోవాలని సీపీని ఆదేశించింది. అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును హైకోర్టు 6 వారాలు వాయిదా వేసింది.
Tags:    

Similar News