కరోనా రోగి నెలలో ఎంతమందికి వైరస్ వ్యాప్తి చేస్తాడంటే?

Update: 2021-03-28 08:30 GMT
క్యాలెండర్ లో రోజులు గడుస్తున్న కొద్దీ.. కరోనా కేసుల నమోదు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. మొన్నటివరకు నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే కరోనా తీవ్రత ఉంటే.. ఇప్పుడు అందుకు భిన్నంగా దేశంలోని పలు రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసుల నమోదు పెరుగుతోంది. తాజాగా 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు.. 46 జిల్లాల కలెక్టర్లు.. మున్సిపల్ కమిషనర్లతో కలిపి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేశ్ భూషణ్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా షాకింగ్ నిజాల్ని వెల్లడించారు. ఒక కరోనా రోగి నిర్లక్ష్యం కారణంగా నెల రోజుల వ్యవధిలో 406 మందికి వైరస్ ను అంటించే అవకాశం ఉందని చెప్పారు. కరోనా తీవ్రత మహారాష్ట్రలోని 25 జిల్లాల మీద ఉందని.. దేశంలోని 59.8 శాతం కేసులు ఆ జిల్లాల నుంచే వస్తున్నాయన్నారు. 90 శాతం మరణాలు 45 ఏళ్లకు పైనే ఉన్న వయసు వారిలోనే సంభవిస్తున్నాయన్నారు.

తాజాగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఏడాది క్రితం కరోనా అంటే వణికిపోయిన చాలామంది.. ఇప్పుడు దాన్ని పెద్ద విషయంగా తీసుకోకపోవటం.. నిర్లక్ష్యంగా వ్యవహరించటం కూడా తాజాగా కేసులు పెరగటానికి కారణంగా చెప్పాలి. అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు..ప్రైవేటు కార్యాలయాల్లోనూ భౌతిక దూరం లాంటి అంశాల్ని పెద్దగా పట్టించుకోకపోవటం కూడా కరోనా కేసుల సంఖ్య పెరగటానికి కారణమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News