సంకీర్త్ హత్య వెనుక కారణమేంటి?

Update: 2016-07-20 11:09 GMT
అమెరికాలో తెలుగు విద్యార్థి సంకీర్త్ దారుణ హత్య వెనుక అసలు కారణాలేంటి...? సంకీర్త్ - సందీప్ ల మధ్య గొడవ ఎందుకు జరిగింది..? ఈ గొడవలో - హత్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి.  తెలుగు విద్యార్థులైన సంకీర్త్‌ - సాయిసందీప్‌ ఒకే గదిలో ఉంటున్నారు. సంకీర్త్‌ ను సాయి సందీప్‌ గదిలోనే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇద్దరూ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులేనని చెబుతున్నా.. సందీప్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది.   ప్రస్తుతం నిందితుడు సాయిసందీప్‌ ని అదుపులోకి తీసుకున్న ఫెడరల్‌ పోలీసులు - కేసును విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగింది - ఎందుకు చంపేశాడనే విషయంపైన ఆరా తీస్తున్నారు. కాగా, వీకెండ్‌ పార్టీలో ఈ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది.

 సంకీర్త్‌(25). ఎమ్‌ ఎస్‌ కోసమని రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్‌ పూర్తి చెశాడు. మూడు నెలల క్రితమే ఆస్టిన్‌ లో ఉద్యోగంలో చేరి - అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సంకీర్త్‌ సోమవారం అర్థరాత్రి తన రూమ్‌ లోనే దారుణ హత్యకు గురయ్యాడు. సంకీర్త్‌ కి ఇటీవలే డ్రాసిస్టంలో హెచ్‌1బీ వీసా వచ్చింది.  సంకీర్త్‌ హత్యకు గురైన విషయం మంగళవారం ఉదయం ఫోన్‌ ద్వారా కుటుంబసభ్యులకు తెలిసింది.   మరోవైపు నిందితుడు సాయి సందీప్‌ పదిహేను రోజుల క్రితమే సంకీర్త్‌ ఉంటున్న గదిలోకి చేరాడు.  అప్పటికే ఆ గదిలో మరో ఇద్దరు ఉన్నారని - సాయిసందీప్‌ ని ఇటీవలే ఓ కన్సల్టెన్సీ అదే గదికి పంపించిందని సంకీర్త్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  ఏదో చిన్న గొడవ జరిగిందని తమకు తెలిసిందని, కాని కచ్చితంగా ఏం జరిగిందో తెలియదని చెబుతున్నారు. నిందితుడు ఎలాంటి ఉద్యోగం లేకుండా గదిలో ఉంటున్నాడని సంకీర్త్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.

గదిలోనే ఉన్నా హత్య జరిగిన సంగతి తెలియదట..

అయితే.. సంకీర్త్‌ హత్య జరిగిన సమయంలో ఆ గదిలో ఉండే మరో స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడట.  కానీ, ఆయన మాత్రం తానేమీ చూడలేదని.. తాను వేరే గదిలో ఉన్నానని చెబుతున్నాడు.  అంతకు కొద్దిసేపు ముందే పడుకునేందుకు పడక గదికి వెళ్లానని, కాసేపటికి సాయిసందీప్‌ చేసింది చూసి షాక్‌ కు గురయ్యానని చెప్పారు. సందీప్‌ ఇటీవలే తమ గదికి వచ్చాడని చెబుతున్నాడు.  అతని గురించి తమకు పూర్తి వివరాలు తెలియవన్నారు.  తాను పడుకున్నాక ఈ సంఘటన జరిగిందని.. పడుకోవడానికి ముందు గొడవేమీ జరగలేదని కూడా చెబుతున్నారు.

గదిలో ఉండేవారితో గొడవ జరిగిందని సంకీర్త్ కుటుంబసభ్యులు చెబుతున్నా అలాంటిదేమీ లేదని ఆ గదిలోని మరో సభ్యుడు చెబుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  దీంతో ఈ ఘటన వెనుక ఏదో రహస్యం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంకీర్త్ ను డబ్బు కోసం చంపారన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. సందీప్ ఉద్యోగం చేయకపోవడంతో డబ్బుల కోసం ఏమైనా గొడవ జరిగిందా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News