మాస్టార్లు క్లాస్ తీసుకుంటే...దబిడ దిబిడేనా....?

Update: 2022-02-08 08:56 GMT
బతకలేక బడి పంతులు అని ఒక ముతక సామెత ఉంది. లెజండరీ హీరో అక్కినేని నటించిన అందాల రాముడు సినిమాలో ఆరుద్ర  రాసిన ఒక చక్కని గీతం ఉంది. అందులో బతక లేక బడి పంతులుగా చేరితే పది నెలల దాకా జీతమివ్వరు అని పదాలు ఉన్నాయి.  అంటే ఇప్పటికి యభై ఏళ్ల నాడు టీచర్ల సీన్ అదన్న మాట. అయితే కాల గమనంలో బడి పంతులు పోస్టులు కూడా బంగారంగా మారాయి.

ఉపాధ్యాయులు లక్షల్లో జీతాలు కళ్ల చూస్తున్నారు. ఇక తమ పాఠాలేవో తాము చెప్పుకుంటూ పోయే పంతుళ్ళు సాధారణంగా రోడ్డు మీదకు రారు. వారు వచ్చారూ అంటే ఎవరికైనా పాఠాలు చెప్పకుండా వదిలిపెట్టరు. ఇపుడు ఏపీలో సీన్ చూస్తూంటే టీచర్లు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ మీద మండిపోతున్నారు.

రివర్స్ పీయార్సీని అమలు చేస్తూ తమకు ఏ విధంగానూ ఉపయోగం లేని విధంగా చేశారని ఉపాధ్యాయులు ఆగ్రహావేశాలు ప్రదశిస్తున్నారు. తాము బెత్తం పట్టగలం, బయటకు వస్తే గొంతెత్తి నినాదాలూ చేయగలమని కూడా చెబుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చలో విజయవాడ ఆందోళన హిట్ అయింది అంటే  దాని వెనక ఉన్నది లక్షలాదిగా ఉపాధ్యాయులే.

దానికి ముందు కలెక్టరేట్ల ముట్టడిలోనూ ఉపాధ్యాయులే లీడ్ రోల్ తీసుకున్నారు. వెల్లువలా వారే కదలి వచ్చి సర్కార్ కి వ్యతిరేకంగా నినదించారు. అయితే ఉపాధ్యాయులను ముందు పెట్టి ప్రభుత్వం వద్ద తమ బలాన్ని చూపిన ఉద్యోగ సంఘాలు చివరికి రాజీపడిపోయి కాడె వదిలేశారు అన్నదే టీచర్ల మంటకు కారణం. అంతే కాకుండా వారు తమ డిమాండ్లను కనీసం పట్టించుకోలేదని కూడా గుస్సా అవుతున్నారు.

ఉపాధ్యాయులు ఎక్కువగా పల్లెటూర్లలో చేస్తూంటారు. అక్కడ ప్రభుత్వం  కేవలం పది శాతం మాత్రమే హెచ్ ఆర్ ఏ ప్రకటించింది. ఇక పల్లెల్లో చేసినా సాయంత్రం అయితే వారు పట్నాలకు చేరుకుంటారు. తమ బిడ్డల చదువు దృష్ట్యా ఉపాధ్యాయులు అక్కడే కాపురం ఉంటారు. వారికి స్కూళ్ళకు రావడం పోవడం తప్ప పెద్దగా బాధ్యతలు లేనందువల్ల పల్లెలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు.

అయితే వారున్న చోట మాత్రం అద్దెలు ఎక్కువ. వారికి ప్రభుత్వం ఇచ్చేది తక్కువ. దాన్ని 10 శాతం ఇచ్చే దాన్ని పన్నెండు శాతం చేయమని అంటున్నారు. ఇక ఫిట్మెంట్ ని కూడా 27 శాతంగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఫిట్మెంట్ విషయంలో 23 శాతం అంటే రివర్స్ పీయార్సీయే అని వారి మాట. ఈ విషయంలో సమ్మె చేసి అయినా సాధించుకోవాలని అంతా కలసి పోరు బాట పడితే మధ్యలోనే ఉద్యోగులు వెనక్కిపోవడం పట్ల వారు ఫైర్ అవుతున్నారు.

తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. తాము కూడా సమ్మె బాట పడతామని చెబుతున్నారు. ఇపుడు చూస్తే పరీక్షల సీజన్ కి గడువు దగ్గర పడుతోంది. ఉపాధ్యాయులతో అసలైన పని సర్కార్ పెద్దలకు  ఇపుడు రాబోతోంది. దాంతో ప్రభుత్వం కచ్చితంగా తమ దారికి వస్తుందని, అలా తాము క్లాస్ తీసుకుంటామని నిబ్బరంగా చెబుతున్నారు.

ఇక చూస్తే నిన్నటిదాకా ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులతో కలసి ఉద్యమిస్తే ఇపుడు యూటీఎఫ్ కూడా జత కలుస్తోంది. ఈ రెండు బలమైన యూనియన్లతో ఏపీలో లక్షలాది మంది ఉపాధ్యాయులు పోరు బాట పడితే సర్కార్ కి కష్టమే అంటున్నారు. మొత్తానికి చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు సాధించలేనిది ఉపాధ్యాయులు సాధిస్తారా. 27 శాతం ఫిట్మెంట్ కి సర్కార్ ని ఒప్పించగలరా అంటే వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News