కాశ్మీర్ ఎమ్మెల్యేపై ఢిల్లీలో ఇంకు దాడి

Update: 2015-10-19 11:50 GMT
గోమాంస ప్ర‌కంప‌న‌లు దేశాన్ని ప‌ట్టి ఊపేస్తున్నాయి. గోమాంసం.. గోవ‌ధ‌కు సంబంధించి ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగ‌టం.. ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర నుంచి బీజేపీ ఎమ్మెల్యే వ‌ర‌కూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం.. దీనిపై తాజాగా బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా లాంటి వారి వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. బీజేపీ నేత‌లు కామ్ గా ఉన్నా.. వారు రాజేసిన నిర‌స‌న జ్వాల అంత‌క‌తంత‌కూ మండుతూనే ఉంది. తాజాగా చూస్తే.. జ‌మ్మూకాశ్మీర్‌కు చెందిన ఇంజ‌నీర్ ర‌షీద్ పై ఇంకు దాడి జ‌రిగింది. ఇంత‌కీ ఇంజ‌నీర్ ర‌షీద్ ఎవ‌రంటారా?గోమాంస భ‌క్ష‌ణ మీద  నిషేధం ఉన్న జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బీఫ్ పార్టీ ఏర్పాటు చేసి విందునిచ్చారు. దీంతో అగ్ర‌హం చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఇత‌నిపై కాశ్శీర్ అసెంబ్లీలో అయ‌న చెంప చెళ్లుమ‌నిపించారు. ఈ మ‌ధ్య‌న ఇదో వివాదంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీలోని ప్రెస్‌ క్ల‌బ్ వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆయ‌పై ఇద్ద‌రు యువ‌కులు దాడి చేసి.. ఆయ‌న ముఖంపై ఇంకు రాసేశారు. త‌మ‌కు గోమాత దేవ‌త లాంటిద‌ని.. అలాంటి గోవు విష‌యంలో త‌మ మ‌నోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్య‌లు చేసినందుకే తాము ఇంకుతో దాడి చేశామ‌ని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై ఇంకు దాడి చేసిన యువ‌కులును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

మ‌రోవైపు త‌న‌పై ఇంకు దాడి జ‌రిగిన‌ప్ప‌టికీ తాను వెన‌క్కి త‌గ్గ‌న‌ని ర‌షీద్ తేల్చి చెప్పారు. ఇలా ఎవ‌రికి వారు మొండిగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా ఈ విష‌యం ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న‌ది ఆందోళ‌నక‌రంగా మారింది.
Tags:    

Similar News