సరిహద్దుల్లో చైనా చొరబాట్లు 'ఫంగస్' కోసమా?

Update: 2022-12-26 17:30 GMT
భారత భూభాగంలోకి చైనా తరుచూ చొరబాట్లకు పాల్పడుతోంది. గాల్వాన్ లోయ ఘటనతో ఈ సంఘటన ప్రపంచం మొత్తానికి తెలిసింది. భారత జవాన్లు చైనా సైనికులను గట్టిగా ఎదుర్కోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పలువురు భారత జవాన్లు అమరులు కాగా చైనా సైనికులు సైతం అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలోనే భారత్ చైనాకు గట్టి షాకిచ్చింది. చైనాకు చెందిన 54కు పైగా చైనా యాప్ లను నిషేధించింది. భారత్ లోని చైనా కంపెనీలపై కొరడా ఝళిపించడంతో పాటు దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే చైనా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినింది. పక్కలో బల్లెంలా మారుతున్న చైనాపై ఈ సంఘటన తర్వాత నుంచి భారత్ ఆధారపడటాన్ని తగ్గించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మేకిన్ ఇండియా కాన్సెప్ట్ తో భారత్ ముందుకెళుతోంది.

మరోవైపు చైనా ఎప్పటి నుంచి అరుణాచల్ ప్రదేశ్ ను తన భూభాగంగా పేర్కొంటూ భారత్ ను కవ్విస్తోంది. చైనా మ్యాప్ లోనూ అరుణాచల్ ప్రదేశ్ ను తన భూభాగం పేర్కొనడంతో గతంలోనే భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా చైనా తరుచూ సరిహద్దుల్లో చొరబాట్లకు పాల్పడటం వెనుక ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అరుణచల్ ప్రదేశ్ లోని ఓ అరుదైన ఫంగస్ సేకరణ కోసమే చైనా భారత భూభాగాల్లోకి తరుచూ వస్తోందని ఐపీసీఎస్సీ తాజా నివేదికలో వెల్లడించింది.

ఇటీవల తవాంగ్ సెక్టర్లోకి చైనా సైన్యం అక్రమంగా ప్రవేశించడంతో భారత జవాన్లు గట్టిగా తిప్పికొట్టిన సంగతి తెల్సిందే. అయితే చైనా పదేపదే చొరబాటుకు పాల్పడటానికి ఓ ఫంగస్ సేకరణ కారణమని ఇండో పసిఫిక్ ఫర్ స్ట్రాటెజిక్ కమ్యూనికేషన్ (ఐపీసీఎస్సీ) ఒక నివేదికల్లో పేర్కొంది. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ను గొంగళి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ గా పిలుస్తారని వెల్లడించింది.

ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని పేర్కొంది. చూడటానికి ఇవి పుసుపు.. కషాయ రంగులో సన్నటి పోగులా ఉంటాయని.. వీటిని సూపర్ మష్రూమ్ గా పిలుస్తారని వెల్లడించింది. ఈ కార్డిసెప్స్ అత్యంత ఖరీదైనవి.. బంగారం ధర కంటే ఎక్కువని పేర్కొంది. కార్డిసెప్ప్ 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లు (56 వేలు) ఉందని సమాచారం. మేలైన రకం కిలో ధర లక్షల్లోనే ఉంటుందని  నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ అరుదైన ఫంగస్ జాతి చైనా నైరుతిలోని కింగై.. టికెట్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. 2022 నివేదిక ప్రకారంగా అంతర్జాతీయంగా కార్డిసెప్ప్ మార్కెట్ ధర వెయ్యి మిలియన్ డాలర్లుగా ఉందని సమాచారం. అయితే గత రెండేళ్లుగా కింగై ప్రాంతంలో వీటి సాగు క్షిణించిందని దీంతో డిమాండ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే కార్డిసెప్స్ ను వెతుక్కుంటూ చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబాట్లకు పాల్పడుతున్నారని ఐపీసీఎస్సీ  వెల్లడించింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News