యూట‌ర్న్ లేదు..కాపుల‌కు 10వేల కోట్లు!

Update: 2018-08-01 06:38 GMT
కాపు రిజ‌ర్వేష‌న్లపై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై లేనిపోని గంద‌ర‌గోళాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తోంది ఏపీ అధికార‌ప‌క్షం. గాలి మాట‌ల‌తో లేనిది ఉన్న‌ట్లుగా న‌మ్మించే చంద్ర‌బాబు మాయాజాలంపై జ‌గ‌న్ తాజాగా విరుచుకుప‌డ్డారు. బాబు అండ్ కో చేస్తున్న విష ప్ర‌చారాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఏపీ అధికార‌ప‌క్షం అనుస‌రిస్తున్న దుర్మార్గ రాజ‌కీయాల‌పై త‌న‌దైన శైలిలో మండిప‌డ్డారు.

పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌సంగించిన జ‌గ‌న్ ఏమ‌న్నారన్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..
 
+  మీరంతా ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు మీకు హీరో నచ్చుతాడా.. విలన్‌ నచ్చుతాడా?  హీరో నచ్చుతాడు అన్నప్పుడు ఆ హీరో మీకు ఎందుకు నచ్చుతారు? కారణం.. హీరో అబద్ధాలు ఆడడు. మోసం చేయడు. హీరో హీరోగా ఉండి తొలుత కష్టాలు పడ్డా.. తుదకు అతనిదే పైచేయి అవుతుంది కాబట్టి నచ్చుతాడు. హీరోకు విలన్‌కు తేడా అది. అలాగే జగన్‌ అనే వ్యక్తి మోసం చేయడు, అబద్ధాలు చెప్పడు. చేయలేనివి చేస్తానని జగన్‌ నోట్లో నుంచి రాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.

+ చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా.. అని ఎల్లో మీడియాను, చంద్రబాబుని, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆరాట పడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను. ఇదే బాబు.. కాపులకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే. ఇది మోసం కాదా? ఈ పెద్దమనిషి ఇలా మోసం చేస్తే, నేను.. జగన్‌ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 వేల కోట్లను రూ.10 వేల కోట్లకు పెంచుతానని చెప్పడం మోసమా?

+ మాట తప్పడం, మడమ తిప్పడం (యూటర్న్‌) మా ఇంటా వంటా లేదు. కాపు రిజర్వేషన్లపై నా మాటల్ని దారుణంగా వక్రీకరించారు. కాపులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. మోసం చేసే వాడే ఎదుటి వాడిపై నేరం మోపినట్టుగా చంద్రబాబు తీరు ఉంది.  అధికారంలోకి రాగానే ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కాపుల‌కు కేటాయిస్తాం.

+ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు అడుగడుగునా మోసాలు చేశాడు. అబద్ధాలాడాడు. ప్రతి రోజూ ఒక డ్రామా, సినిమా చూపిస్తాడు. ‘ఎన్నికలకు ఆరునెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అంటూ రోజుకొక సినిమా చూపిస్తాడు. ఈనాడు పేపర్‌ చూస్తే చంద్రబాబు కొత్త డ్రామా కనిపిస్తుంది.

+  ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్‌ చూశా. ఈనాడంటే చంద్రబాబు పేపరే.. అది ఆయన పాంప్లెట్‌ పేపర్‌. ఈనాడులో కనిపించిందేమిటో తెలుసా? చంద్రబాబు కాపుల రిజర్వేషన్‌ కోసం కేంద్రంతో గొడవ పడండని తన ఎంపీలకు చెప్పాడంట. నిజంగా ఈ డ్రామాలు చూస్తే ఆశ్చర్యం అనిపించింది. రెండు మూడు రోజులుగా మీరంతా చూస్తూనే ఉన్నారు.

+  మొన్న జగ్గంపేటలో నేను మాట్లాడా.. ఆక్కడ నేను మాట్లాడిన మాటల్ని ఎంత దారుణంగా వక్రీకరించారో చూశాం. ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు.. ఇతని పార్టీకి మద్దతు పలకాలని ఆరాట పడుతున్న కొందరు పెద్దలు, వారికి బాకా ఊదుతున్న చంద్రబాబు ఎల్లో మీడియా పేపర్లు, టీవీలు చూసినప్పుడు, హేయమైన, స్వార్థపూరిత రాజకీయాలు చూసినప్పుడు   రాజకీయాలు ఈ స్థాయికి కూడా దిగజారిపోగలుగుతాయా? అనిపించింది.

+  నిజంగా నాకే రాజకీయాలంటే ‘ఛ’ అని అనిపించే పరిస్థితిలోకి ఈ రాజకీయాలు దిగజారాయి. నిజంగా ఒక మోసగాడు తానే మోసం చేసి.. ఆ నేరాన్ని ఎదుటి వారి మీద మోపుతూ.. మోసం చేసిన వాడే మోసం మోసం అని నింద మోపేలా రాజకీయాలు ఉన్నాయి.

+  చంద్రబాబు హయాంలో పిల్లలను బడికి పంపిస్తే ఒక యావరేజ్‌ స్కూలుకు కూడా అక్షరాలా రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు ఫీజు అవుతోంది. ఆ ఫీజులు కూడా ప్రతి ఏటా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెరుగుతూనే ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ చదివించాలంటే భయపడే పరిస్థితి. ఫీజు రూ.65 వేలకు పెరిగిపోయింది. చివరకు తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొంటూ అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు.

+ ప్రభుత్వ స్కూళ్లకు ఏప్రిల్‌లో పాఠ్య పుస్తకాలు ఇవ్వాలి. ఆగస్టు వస్తున్నా ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మొదటి క్వార్టర్‌ పరీక్షలు ప్రారంభం కావాలి. కానీ ఇప్పటి వరకు పుస్తకాలు ఇవ్వలేదు. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు కాకుండా ప్రయివేటు స్కూళ్లు నారాయణ, చైతన్యలకు వెళ్లేలా చేస్తున్నారు.. ఆ స్కూళ్లు చంద్రబాబు బినామీ. అందుకే రేషనలైజేషన్‌ పేరిట దగ్గరుండి ప్రభుత్వ స్కూళ్లను మూసి వేయిస్తున్నారు.
 
+  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు నీరుగార్చారు. ఇక్కడే ఉన్న సూరంపాలెంలోని ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి వికాస్‌ ఉదయం నా వద్దకు వచ్చాడు. ఆ కాలేజీలో ఫీజు రూ.95 వేలట. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.30 వేలు, రూ.35 వేలు ఇస్తున్నారు. గత ఏడాది ఫీజులు ఇంతవరకు ఇవ్వలేదు. మిగిలిన రూ.65 వేలు తల్లిదండ్రులు కట్టలేరని విద్యార్థి రుణం తీసుకున్నాడు. రూ.1.80 లక్షలు రుణం తీసుకున్నానని చెప్పాడు. వడ్డీ కింద విద్యార్థి తండ్రి నెల నెలా రూ.2500 కడుతున్నాడు.

+ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ రుణం తీçర్చుకోవడానికి మిగిలిన ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని ఆ విద్యార్థి నాతో వాపోయాడు. ఆరోగ్యశ్రీ నాలుగేళ్లలో పడకేసింది. చిన్న చిన్న రోగాల నుంచి పెద్ద రోగాల వరకు వైద్యం అందే పరిస్థితి లేక పేదలు అప్పులు పాలయ్యే పరిస్థితి తీసుకువచ్చాడు.

+  108కు ఫోన్‌ చేస్తే వస్తుందన్న నమ్మకం లేదు. డీజిల్‌ లేదని, మూడు నెలలుగా డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇళ్లు లేవు. ఇళ్ల స్థలాలు లేవు. రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. మినరల్‌ వాటర్‌ కనిపించకపోయినా మందు షాపులు లేని గ్రామాలు లేవు. పెన్షన్, రేషన్, మరుగుదొడ్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఏది ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీల మాఫియాకు లంచం లేనిదే పని జరగడం లేదు.
 
+  ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో తిరుగుతుంటే ఇక్కడి ప్రజలు నాతో అన్న మాటలు.. అన్నా.. నాలుగున్నరేళ్ల టీడీపీ ప్రభుత్వం మాకు మంచి చేయక పోయినా ఫర్వాలేదు. హాని చేయకపోతే అదే చాలు అంటున్నారు. అన్నా.. ఇక్కడి ఎమ్మెల్యే మా వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని, ఆ ఫొటోలను.. ఫ్లెక్సీలుగా చేసి ఊరూరా పెట్టి ఓట్లు వేయించుకున్నారన్నా.. ఇçప్పుడు నాలుగేళ్లుగా ఆ ఎమ్మెల్యే మాతో కన్నీళ్లు పెట్టిస్తున్నారన్నా.. అని చెబుతున్నారు. అన్నా.

+  కాకినాడ సెజ్‌ (ఎస్ఈజెడ్‌) భూ నిర్వాసితులు నా వద్దకు వచ్చారు. అన్నా.. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతారు. పనయ్యాక మరో మాట మాట్లాడుతున్నారన్నా అని చెప్పారు.  ఆ రోజు కాకినాడ ఎస్ఈజెడ్‌ భూములు తిరిగి ఇప్పిస్తానని చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు చెప్పారన్నా.. కానీ ఇంతవరకు ఇవ్వలేదన్నా.

+ కాకినాడ ఎస్ఈజెడ్‌ భూములు జగన్‌కు సంబంధించినవని ఆ రోజు ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు ఆరోపించారు. రైతుల అవస్థలు చూసి నేనే సవాల్‌ చేశాను. అయ్యా చంద్రబాబూ.. ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వండని చెబితే ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు సీఎం అయ్యాక రైతులు తమ భూముల కోసం ఆందోళన చేస్తుంటే తిరిగి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించే పరిస్థితి ఏర్పడింది.

+  ఏ విషయంపైన అయినా ఇతరులపై బురద వేయడం, భ్రష్టు పట్టించడం చంద్రబాబు నైజం. యూ.కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్‌ సమీపంలో ఉప్పుటేరు వద్ద షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అది వచ్చిందా? ఎన్నికలు అయిపోయాక మోసం చేశారు.

+  చంద్రబాబు ఊరికి పది ఇళ్లు కూడా కట్టించలేదు. ఎక్కడా పేదవారికి సెంట్‌ స్థలం ఇవ్వడం లేదని, మహానేత ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కుంటున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో 15 వేల ఇళ్లు కట్టించారని చెబుతుంటే నిజంగా సంతోషమనిపించింది.

+  ఎవరు మోసం చేశారని చంద్రబాబును నిలదీసి అడుగుతున్నా.. ఎవరయ్యా మోసం చేసింది? ఎవరు మోసం చేశారో కాపు సామాజిక వర్గంలోని ప్రతి సోదరుడికి తెలుసు. ఎన్నికలకు ముందు మోసం చేసింది నీవు కాదా? ఎన్నికలకు ముందు ఫలానాది చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చేయకపోవడాన్ని మోసం అంటారా? కాదా? చంద్రబాబు మోసం ఏ స్థాయిలో ఉందనడానికి నిదర్శనమే నిన్న జరిగిన ఘటన. జాట్లు, పటేళ్లు, గుజ్జర్లు.. ఇలాంటి వారంతా ఆయా రాష్ట్రాల్లో కులాల రిజర్వేషన్లు కావాలని అడుతున్నారు. మన రాష్ట్రంలో కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నా సోదరులు అదే డిమాండ్‌ చేస్తున్నారు.

+  ఇలాంటి నేపథ్యంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంటు. ఇది మన అందరికీ కనిపిస్తున్న చిక్కుముడి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డిమాండ్లపై దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపని పరిస్థితి కళ్ల ముందు ఉంది. దశాబ్దాలుగా పరిష్కారం రాని ఇలాంటి జఠిలమైన సమస్య మీద చంద్రబాబు తాను చేసేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం మోసం కాదా? మీ అందరి సమక్షంలో ఇదే పెద్దమనిషి చంద్రబాబును అడుగుతున్నా.

+  అయ్యా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలిసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి  అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పిసానని చెప్పడం మోసం కాదా? ఆ మాటను నిలబెట్టుకోవాలన్న కాపులను అణచివేసేందుకు వారిని వేధిస్తున్నప్పుడు వారికి తోడుగా నేనున్నానని అన్న జగన్‌ మోసగాడా? కాపుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసేంత వరకు చంద్రబాబునాయుడుకు కమిషన్‌ వేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు.

+  కాపుల ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నప్పుడు హడావుడిగా  కమిషన్‌ వేశాడు. ఆ కమిషన్‌ పరిస్థితి ఏమిటో తెలుసా? కమిషన్‌ చైర్మన్‌ సంతకం లేకుండానే నివేదికను అసెంబ్లీలో పెట్టి తూతూమంత్రంగా తీర్మానించి కేంద్రానికి పంపడం మోసం కాదా? ఇదే చంద్రబాబు  కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో నాలుగున్నరేళ్లు అధికారం పంచుకుని సంసారం చేశారు.సంసారం చేసినప్పుడు ఇదే చంద్రబాబునాయుడు చెప్పిన మాట.. మేనిఫెస్టోలో పెట్టిన మాట.. నిలబెట్టుకోకపోవడం మోసం కాదా? మేము అధికారంలోకి రాగానే కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నా.

+  చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు. చేసేవన్నీ మోసాలు. పొరపాటున ఇలాంటి వ్యక్తులను క్షమిస్తే రేప్పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఈ పెద్దమనిషి చంద్రబాబు మీ అందరి దగ్గరకు వచ్చి మీచెవుల్లో పువ్వు ఉందా.. లేదా? అని చూస్తాడు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేసేశానని మీ చెవుల్లో కాలిఫ్లవర్‌ పెడతాడు.

+  అది మీరు నమ్మరని ప్రతి ఇంటికి కేజీ బంగారం - బోనస్‌ గా బెంజి కారు ఇస్తానంటాడు. అదీ నమ్మరని ప్రతి ఇంటికి మహిళా సాధికార మిత్రలను పంపిస్తాడు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు పెడతాడు. రూ.5 వేలు ఇవ్వాలని అడగండి. ఆ సొమ్మంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి.
Tags:    

Similar News