జగన్ వర్సెస్ లోకేష్.... రికార్డు టీడీపీదే...?

Update: 2022-11-14 06:48 GMT
ఏపీలో యువ నేత, టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ మంచి దూకుడు మీద ఉన్నారు. కలిసొచ్చే కాలానికి పాదయాత్రలో నడిచొచ్చే కొడుకుంగా నారా లోకేష్ తండి చంద్రబాబుకు మారనున్నారు. ఇన్నాళ్ళూ నీ కష్టమే చూశాను నాన్నా, ఇపుడు నా రెక్కల కష్టంతో మీకు రాజ్యం అందిస్తాను అని ప్రమాణం చేసి మరీ  జనంలోకి వెళ్తున్నారు.

నాలుగు పదులు వయసు ఉన్న లోకేష్ టీడీపీ అన్న పార్టీ పుట్టాక పుట్టారు. ఇపుడు అదే టీడీపీని తన స్వశక్తితో పట్టాలకు ఎక్కించి పరుగులు తీసేలా చేయాలనుకుంటున్నాడు. జనవరి 27 నుంచి నారా లోకేష్ చేపడుతున్న సుదీర్ఘ పాదయాత్ర టీడీపీ రాజకీయాన్ని మొత్తానికి మొత్తం మారుస్తుంది అని అంతా ఆశిస్తున్నారు.

అంతే కాదు టీడీపీలో తిరుగులేని నాయకుడుగా చంద్రబాబు తరువాత తానే అని పార్టీ మొత్తం అంగీకరించేలా లోకేష్ తయారవుతాడని కూడా అంటున్నారు. ఇక ఏపీ జనాలలో విపక్షం వేసిన పప్పు ముద్రను చేరిపేసుకుని తాను పదును తేరిన నిప్పుని అని నిరూపించుకోవడానికి లోకేష్ ఈ పాదయాత్రను వాడుకుంటారని అంటున్నారు. ఏడాదికి పైగా సుదీర్ఘ పాదయాత్రకు యువ నేత లోకేష్ శ్రీకారం చుడుతున్నారు.

ఈ పాదయాత్ర 2023 మార్చి దాకా కొనసాగుతుంది అంటే కచ్చితంగా పదిహేను నెలలు అని అంచనా వేసుకోవచ్చు. ఇక చంద్రబాబు సొంత సీటు కుప్పం నుంచి నారా వారి సొంత జిల్ల కుప్పం నుంచి వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచే లోకేష్ తొలి అడుగులు పాదయాత్ర ద్వారా వేయబోతున్నారు. ఆ విధంగా తాను సైతం రాయల  సీమ బిడ్డనని గట్టిగా చాటుకోవడమే కాదు, జగన్ సర్కార్ ని దించి తెలుగుదేశం పార్టీని తీసుకురవడం ద్వారా సీమను సుభిక్షం చేస్తామని ఒట్టేసి మరీ చినబాబు జనంలోకి రానున్నాడు.

ఇక్కడ మరో విషయం ఉంది. జగన్ 2017 నవంబర్ 6న పాదయత్ర మొదలెట్టారు. ఆయన ఏకంగా ఆనాటి పదమూడు జిల్లాలను దాటుకుంటూ ఇచ్చాపురం దాకా నడచిన నడక చూస్తే ఏకంగా 3,750 కిలోమీటర్లు పై దాటింది. ఈ రోజుకి అదే అతి పెద్ద రికార్డు. జగన్ తన పాదయాత్ర ద్వారా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో 125 దాకా అసెంబ్లీ సీట్లను టచ్ చేస్తూ పాదయాత్ర చేశారు. ఎక్కువగా ఆయన రూరల్ ప్రాంతాల్లో పాదయాత్ర ఉండేలా చూసుకున్నారు.

ఇపుడు లోకేష్ టార్గెట్ ఏంటి అంటే జగన్ రికార్డుని బద్ధలు కొట్టడం. జగన్ పాదయాత్ర ద్వారా స్థాపించిన 3,750 కిలోమీటర్ల అతి పెద్ద రికార్డుని బద్ధలు కొట్టడం. అందుకే లోకేష్ పాదయాత్ర ఏకంగా నాలుగు వేల కిలోమీటర్లు పైన సాగేలా రూట్ మ్యాప్ ని రెడీ చేసుకున్నారు. ఇక జగన్ 125 అసెంబ్లీ సీట్లనే టచ్ చేస్తే తాను ఏకంగా 175 అసెంబ్లీ సీట్లలో పాదయాత్ర చేసేలా రూపకల్పన చేసుకున్నారు.

అలాగే లోకేష్ కూడా రూరల్ బేస్డ్ ప్రాంతాల మీద ఫోకస్ పెడుతున్నారు. అక్కడ స్ట్రాంగ్ ఉందనుకుంటున్న వైసీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా చేసుకుంటారు అని అంటున్నారు. ఇక జగన్ కోటి మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా తన పాదయాత్రలో కలిశారు. లోకేష్ ఆ సంఖ్యను వీలైతే రెట్టింపు చేయాలని ఆలోచనలో ఉన్నరట. అంటే రెండు కోట్ల మంది ప్రజలను నేరుగా కలుసుకుని టీడీపీ ఏపీలో అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత  గురించి చాటి చెబుతారు అని అంటున్నారు.

ఏది ఏమైనా లోకేష్ జగన్ని టార్గెట్ చేశారు. వైసీపీని అధికారంలో నుంచి దించడమే కాదు, ఏపీలో పాదయాత్ర అంటే ఇక మీదట లోకేష్ దే అని చెప్పుకునేలా తన రికార్డుని ఎవరూ చెరిపేయకుండా ఉండేలా లోకేష్ భారీ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు. చినబాబు చేపట్టిన ఈ బిగ్ టాస్క్ విజయవంతం అవుతుందని తమ్ముళ్ళు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News