జార్ఖండ్ లో జాప్యానికి కారణమిదేనా ?

Update: 2022-09-03 05:33 GMT
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ పై అనర్హత వేటు వేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఏమిజరుగుతుందో అర్ధంకాక అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. తన సొంతానికి గనులను కేటాయించుకున్నారనే ఆరోపణలను హేమంత్ ఎదుర్కొంటున్నారు. ఇందులో వాస్తవాలున్నాయని దాదాపు నిర్ధారణ కూడా అయ్యింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన భార్య పేరుతో సుమారు 11 ఎకరాల గనులను హేమంత్ కేటాయించుకున్నట్లు రుజువులతో సహా బయటపడింది.

దాంతో హేమంత్ ఎంఎల్ఏ పదవికి అనర్హునిగా ప్రకటించాలని బీజేపీ నానా గోల చేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తే అనర్హత వేటుకు కమీషన్ రాష్ట్ర గవర్నర్ రమేష్ బియాస్ కు సిఫారసు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ సిఫారసులో ఏముందో ఎవరికీ తెలియకపోయినా కమీషన్ సిఫారసు చేసి దాదాపు ఐదు రోజులైంది. కమీషన్ సిఫారసును అందుకున్న తర్వత గవర్నర్ హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. దాంతో అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ అనుమానాలు ఏమిటంటే హేమంత్ పై  అనర్హత వేటు కన్నా ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర తరహాలోనే జార్ఖండ్ లో కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ ఎంఎల్ఏలను చీల్చి హేమంత్ ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నదే బీజేపీ ఎత్తుగడగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అనర్హత వేటు వేస్తే హేమంత్ పక్కకు తప్పుకుంటారు కానీ ప్రభుత్వం పడిపోదు.

హేమంత్ స్ధానంలో మరొకరు సీఎం అవుతారంతే.  80 స్ధానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం+కాంగ్రెస్+ఆర్జేడీ కూటమికి సుమారు 50 మంది ఎంఎల్ఏలున్నారు. బీజేపీకి 26 మంది ఎంఎల్ఏలున్నారు.

మిగిలిన వారంతా ఇండిపెండెంట్ ఎంఎల్ఏలే.కూటమిలోని 50 మందిలో జేఎంఎంకు 30, కాంగ్రెస్ 19, ఆర్జేడీకి ఒక్క ఎంఎల్ఏ ఉన్నారు. అంటే జేఎంఎం, కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో చీలిక తేవాలంటే బీజేపీ చాలా కష్టపడాలి. అయినా సరే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ  ఎంతకైనా తెగిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో ఏమో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News