కొత్త వాహనాలు కొనే వారిపై కేసీఆర్ సర్కారు వారి తాజా బాదుడు

Update: 2022-05-10 08:30 GMT
బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పవర్లోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంగా మార్చేశామని.. డెవలప్ మెంట్ లో రాష్ట్రం దూసుకెళుతుందని చెబుతున్న సంగతి తెలిసిందే. మరింతలా డెవలప్ అవుతున్నప్పుడు.. వరుస పెట్టి అనేక పన్నులు.. ఛార్జీలు ఎందుకు పెంచుతున్నట్లు? అన్నది అసలు ప్రశ్న. ఇక్కడ సమస్య ఏమంటే.. పేదలను ఆదుకోవాలి కాబట్టి వారికి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తుంటారు. వారి బతుకుల్ని బాగు చేయాలన్న ఆలోచన మంచిదే. అందుకు మధ్యతరగతి వీపు వాచేలా పన్నుల పెంపు.. ఛార్జీల బాదుడేంది? అన్నది ప్రశ్న.

మధ్యతరగతి అన్నది ఒక బంగారు బాతు లాంటిది. దాని చేత ఎప్పటికప్పుడు బంగారు గుడ్లు పెట్టించుకోవాలే తప్పించి.. దురాశతో వీలైనంత పిండాలని బంగారు బాతును కోసేస్తే.. ఏమవుతుంది. మొదటికే మోసం వస్తుంది. ఇటీవల కాలంలో కేసీఆర్ సర్కారు తీరు ఇలానే ఉంది. తెలంగాణలో భూముల ధరలు పెరగటం.. ఇళ్ల రేట్లు ఆకాశానికి చేరటం.. వివిధ రకాల పన్నుల్ని విపరీతంగా పెంచటం లాంటివి తరచూ జరుగుతున్నాయి. ఇవి సరిపోనట్లు వివిధ సేవలకు సంబంధించిన ఛార్జీలను సైతం పెంచేస్తున్నారు.

వీటన్నింటి ప్రభావం ఎవరి మీద పడేదంటే అటు పేదోళ్లకు.. ఇటు సంపన్నులకు కాదు. మధ్యలో ఉన్న మధ్యతరగతి వారికి. వారి జీతం బెత్తడు అయితే.. వారి మీద భారం బారెడు అన్నట్లుగా ఉండకూడదు. ఈ మధ్యన ఆర్టీసీ ఛార్జీలు పెంచటం.. కరెంటు ఛార్జీలు పెంచటంతో పాటు.. రిజిస్ట్రేషన్ల పన్నులతో పాటు.. అన్ని రకాల ఛార్జీలు.. పన్నుల్ని పెంచేసుకుంటూ పోతున్నారు. తాజాగా కొత్త వాహనాల్ని కొనుగోలు చేసే వారి మీద పన్ను మోతను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త వాహనాల మీద వడ్డించే లైఫ్ ట్యాక్స్ ను భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త విధనాన్ని అమల్లోకి తెచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుణ్యమా అని మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతి వారి మీద ప్రభావం పడునుంది. ఇంతకాలం రూ.లక్ష లోపు టూవీలర్ ను కొనుగోలు చేస్తే లైఫ్ ట్యాక్స్ కింద రూ.9వేలు కట్టాల్సి ఉండేది. అది కాస్తా ఇప్పుడు రూ.12వేలుగా మార్చారు. అంతేనా.. రూ.10లక్షల లోపు విలువ చేసే కారును కొనుగోలు చేస్తే సుమారు రూ.1.20లక్షల లైఫ్ ట్యాక్స్ ను చెల్లించాల్సివచ్చేది. దాన్ని ఇప్పుడు ఏకంగా రూ.1.4లక్షలకుచేసేశారు. అంటే.. ఇప్పుడు వసూలు చేసే దానికి మరో రూ.20వేలు అదనంగా వడ్డించేశారని చెప్పాలి.

సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెహికిల్స్ కొనుగోలు చేసే వారి నుంచి వసూలు చేసే లైఫ్ ట్యాక్స్ ను పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 2 శ్లాబుల స్థానే నాలుగు శ్లాబుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు శ్లాబుల్ని చూస్తే.. ఎవరైనా వ్యక్తిగతంగా  కొత్త వాహనం రూ.5 లక్షల లోపు ఉంటే 13 శాతం పన్ను.. రూ.10 లక్షల లోపు ఉంటే 14శాతం.. రూ.20 లక్షల లోపు ఉంటే రూ.17 శాతం.. రూ.20 లక్షల పైన ఉంటే 18 శాతం పన్నును వసూలు చేయనున్నారు. అదే ఏదైనా సంస్థ కానీ కంపెనీ కానీ కొత్త వాహనాల్ని కొనుగోలు చేస్తే మరింత బాదేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రూ.5లక్షల లోపు వాహనానికి రూ.15శాతం.. రూ.10లక్షల లోపు వాహనానికి 16 శాతం.. రూ.20లక్షల లోపు వాహనానికి  19 శాతం.. రూ.20 లక్షలు దాటితే ఆ వాహనంపై 20 శాతం పన్ను బాదుడు బాదేయనున్నారు. తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన కొత్త లైఫ్ ట్యాక్స్ కారణంగా ఖజానాకు రూ.వెయ్యి కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందన్న అంచనా వేస్తున్నారు. ఈ భారీ పన్ను మొత్తంలో అత్యధికం దిగువ.. మధ్యతరగతి వారి మీద ప్రభావం పడుతుందని చెప్పక తప్పదు.  నిజానికి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ పేదలకు.. నడ్డి విరిచేలా బాదుడు మాత్రం మధ్యతరగతి వారికా? ఇదెక్కడి న్యాయం కేసీఆర్?
Tags:    

Similar News