కేసీఆర్ ఫ్రంట్ జోరు...త్వ‌ర‌లో మొద‌టి ట్రిప్‌

Update: 2018-03-17 17:06 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న త‌ర్వాతి రాజ‌కీయ అడుగుపై దూకుడు పెంచారు. దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు - పునరేకీకృతమవుతున్న ప్రాంతీయ పార్టీలు - ముందుకొస్తున్న కొత్త కూటమి ప్రయత్నాలు - ఎన్డీయే కూటమికి రోజురోజుకు దూరమవుతున్న భాగస్వామ్యపక్షాలు - ఉత్తరప్రదేశ్ - బీహార్‌ లలో బీజేపీకి కలవరం కలిగించిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవ‌లే త‌ను ప్ర‌క‌టించిన‌ థ‌ర్డ్‌ ఫ్రంట్‌ ను వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు సన్న‌ద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా  ప‌శ్చిమ‌ బెంగాల్ సీఎం మమతాబెనర్జీతో భేటీ కానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జాతీయస్థాయిలో బలమైన ప్రజాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, అందుకు ప‌శ్చిమ‌ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మద్దతు పలికారు. త‌దుప‌రి చ‌ర్చ‌ల్లో భాగంగా ఈనెల 19న సీఎం కేసీఆర్ కోల్‌కతా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీతో కేసీఆర్ సమావేశం కానున్నారు. థర్డ్ ఫ్రంట్‌పై మమతతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. థ‌ర్డ్ ఫ్రంట్‌పై మమత సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఇదిలాఉండ‌గా...దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. రాబోయే ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించనున్నాయని, ఇందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ప్రధాన భూమిక పోషించనున్నారని అన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కూడా కేసీఆర్‌ కు ఫోన్‌ చేసి సంఘీభావం ప్రకటించారు.కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడే మూడో ఫ్రంట్‌కు మద్దతు ఇస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. రాజకీయాల్లో కొత్త రక్తం రావాలంటే థర్డ్ ఫ్రంట్ అవసరమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా తృతీయ ప్రత్యామ్నాయం ఆవశ్యకతను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ త‌న కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.


Tags:    

Similar News