కేసీఆర్.. మళ్లీ ఏదో చేసేటట్టే కనిపిస్తున్నాడే?

Update: 2022-06-10 09:30 GMT
ఊరికే పెట్టరు మహానుభావులు అని ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ సడెన్ గా మంత్రులతో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రులతోపాటు మపార్టీ ముఖ్య నేతలతోనూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇన్నాళ్లు ఫాంహౌస్ లో మౌనంగా శూలశోధన చేసిన కేసీఆర్ ఇప్పుడు సడెన్ గా ఈ భేటి పెట్టడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలపై ఏదో ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాడని.. కీలక నిర్ణయాలను మంత్రివర్గంతో చర్చించి తీసుకుంటాడని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

కొన్ని రోజులుగా కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. అక్కడ పీకే సహా చాలా మంది ప్రముఖులను కలిసినట్టు టాక్.  ఇప్పుడు సడెన్ గా కీలక భేటి ఏర్పాటు వెనుక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వచ్చేనెల 18న ఎన్నిక జరుగనుంది.  ఇప్పటివరకు అటు కేంద్రంలోని ముఖ్యులు, ఇటు కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థులపైన కసరత్తు పూర్తి చేశారు.ఆప్షన్లు సిద్ధం చేసుకున్నారు. ముందుగా ఎన్డీఏ తమ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత తమ నిర్ణయం ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మద్దతు కోరుతూ పలు పార్టీలతో ప్రాథమికంగా చర్చలు జరిపారు. అయితే ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు కేసీఆర్ కీలకంగా మారారు.

ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించారు. శివసేన.. ఎన్సీపీ, డీఎంకే, జేడీఎస్, ఆప్ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగేలా నిర్ణయించారు. దీంతో సీఎం కేసీఆర్ నేటి సమావేశంలో జరుగుతున్న పరిణామాలు వివరించి రాష్ట్రపతి ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం టీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలు లేవు. కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతు ఇస్తారా? లేదా? అనేది నేటి సమావేశంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక తెలంగాణలో ప్రతీసారి పబ్ ల ద్వారా అత్యాచారాలు, డ్రగ్స్ బయటపడుతున్నాయి. వీటివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పబ్ లు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే పబ్ ల విషయంలో కూడా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. మొత్తంగా చాలా రోజుల మౌనం తర్వాత కేసీఆర్ ఇప్పుడు సడెన్ గా బయటకొచ్చి మీటింగ్ పెట్టడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News