ఒక్క రోజే అక్కడ ఎన్ని జ‌రిగిపోయాయంటే

Update: 2017-10-04 16:28 GMT
అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనూహ్య రీతిలో క‌న్నుమూసింది మొద‌లు ఆ రాష్ట్రంలో ఎన్నో ట్విస్టులు... ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే అవి ఒక్కో సారి ఒకింత గ్యాప్‌ తో సాగుతున్నాయి. కానీ తాజాగా అందుకు భిన్నంగా ఒకే రోజు నాలుగు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.

క‌ర్ణాట‌క‌లోని ప‌ర‌ప్ప‌ణ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఏఐడీఎంకే నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం విష‌మించిన ఉదంతంలో కీల‌క ప‌రిణామం జ‌రిగింది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్న 74 ఏళ్ల నటరాజన్‌ కు సుమారు ఏడున్నర గంటలపాటు గ్లెనీగిల్స్‌ గ్లోబల్‌ హెల్త్‌ సిటీలో వైద్యులు లివర్‌ - కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్‌ ఆపరేషన్‌ ను విజయవంతంగా పూర్తి చేశారు. రెండు అవయవాల మార్పిడి ఆపరేషన్‌ ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజెస్‌ అండ్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె ఇల్లన్‌ కుమరన్‌ చెప్పారు. బ్రెయిన్‌ డెడ్‌ కు గురైన 19 సంవత్సరాల కార్తీక్‌ అనే రోజు కూలీనుంచి వైద్యులు కాలేయం, కిడ్నీ సేకరించి నటరాజన్‌ కు అమర్చారు.

మ‌రోవైపు అన్నాడీఎంకే మాజీ ప్రధాని కార్యదర్శి శశికళ మరోసారి పెరోల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆస్ప‌త్రిలో విష‌మించిన భ‌ర్త‌ను చూసేందుకు 15రోజులు పెరోల్ కావాలని శశికళ కోరారు. నిన్న దరఖాస్తు చేసుకుంటే సరైన పత్రాలు లేవని జైళ్ల శాఖ తిరస్కరించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు ఆమె ప‌త్రాలు స‌మ‌ర్పించారు. ఇదిలాఉండ‌గా.... అన్నాడీఎంకే అస‌మ్మ‌తి నేత  దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ వాయిదా పడింది. ఈనెల 9వతేదీకి మద్రాస్ హైకోర్టు వాయిదా వేసింది. అంతకంటే ముందు పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్యలేవని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.

అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, తమిళనాడు దివంగ‌త ముఖ్యమంత్రి జయలలిత మృతిపై దర్యాప్తునకు కమిషన్‌ ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ ను విచారించిన మద్రాసు హైకోర్టు దీనిని కొట్టివేసింది.
Tags:    

Similar News