కేసీఆర్ ను తిడితే ఊరుకోం.. మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలుసా?: కేటీఆర్

Update: 2021-08-27 12:30 GMT
మంత్రి కేటీఆర్ ప్రతిపక్ష నేతలపై నిప్పులు చెరిగాడు. సీఎం కేసీఆర్ పై అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని వారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అదే మహారాష్ట్రలో చూడండి.. ముఖ్యమంత్రిపై కామెంట్లు చేస్తే కేంద్రమంత్రిని కూడా అరెస్ట్ చేశారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఏ దిక్కు లేక పక్క పార్టీలో నుంచి ఒకరిని దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబు తొత్తు, బినామీని తీసుకొచ్చి పార్టీకి అధ్యక్షుడిని చేశారని ఆరోపించారు. డబ్బు సంచులతో దొరికిపోయినోన్ని అధ్యక్షుడిని చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. నోరు పారేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణ సాధించిన నేత, సుధీర్ఘమైన రాజకీయ చరిత్రగల నాయకుడు, ప్రజల దశాబ్ధాల కలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు సీఎం అయ్యారని పేర్కొన్నారు. అలాంటి నేతను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బ తప్పదు అని.. ప్రతిపక్షాలకు కూడా అలాగే బుద్ది చెప్తాం అని కేటీఆర్ అన్నారు.

సహనం, ఓపికకు ఓ హద్దు ఉంటుందని.. రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడాలని కేటీఆర్ అన్నారు. కానీ ఆ పరిస్థితి లేదన్నారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని తిడితే ఒక కేంద్రమంత్రి అని కూడా చూడకుండా లోపల పడేశారని.. మరి మేం కూడా చేయమంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

జర్నలిస్ట్ ముసుగులో ఉండి కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News