ఉక్రెయిన్ - రష్యా యుద్దం.. కారు కలను దెబ్బ తీయనుందా?

Update: 2022-03-19 23:30 GMT
ప్రపంచం చిన్న కుగ్రామంగా మారిందన్న మాట చాలాసార్లు విన్నా.. కొన్ని సందర్భాల్లో అదెంత నిజమన్న విషయం ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తున్న పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడో ఒక మూల జరిగే పరిణామం సైతం.. ఆ ప్రాంతానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ దాని ప్రభావం పడటం డిజిటల్ ప్రపంచంలో మామూలైంది. అక్కడెక్కడో ఉక్రెయిన్ - రష్యాల మధ్య యుద్ధం జరగటం ఏమిటి? మన దేశంలో కారు కొనాలనుకునే వారి కలను దెబ్బ తీయటం ఏమిటి? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. కాస్తంత లోతుల్లోకి వెళ్లి విషయాన్ని చూస్తే.. ఈ విషయంలో వాస్తవం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.

ఉక్రెయిన్ - రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ముడిచమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ..అది దేశప్రజల మీద పడకుండా మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలు ఏ మాత్రం పెరిగినా.. తమకు ప్రతికూల పరిస్థితులు ఖాయమన్న విషయాన్ని గుర్తించిన కేంద్రం.. ధరల పెంపు దిశగా ఆలోచనలు చేయటం లేదు.దీంతో.. పోటు ఖాయమని మానసికంగా ఖరారైన వారికి.. మోడీ ప్రభుత్వ నిర్ణయం సాంత్వన చేకూరేలా మారింది. ఇదిలా ఉంటే.. ఈ యుద్ధం మరో మూడు నాలుగు నెలలు కొనసాగితే మాత్రం మరిన్ని సమస్యలు తలెత్తటం ఖాయమంటున్నారు.

కరోనా కారణంగా కార్లు.. సెల్ ఫోన్లలో ఉపయోగించే చిప్ సెట్ల కొరత కారణంగా వాటి ధరలు ఎంతలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకు ముందు 8జీబీ ర్యామ్ ఉన్న ఫోన్.. పదిహేను వేలకు వచ్చేస్తే.. చిప్ ల కొరతతో.. అది కాస్తా ఇప్పుడు రూ.25వేలకు పైనే పెరిగిపోయింది. ధరాభారం మాత్రమే కాదు.. చిప్ ల కొరత కారణంగా కొత్త మోడళ్లు అనుకున్న దాని ప్రకారం మార్కెట్లోకి విడుదల చేయలేని పరిస్థితి.  దీంతో.. మొబైల్ ఫోన్ల ధరలు పెరిగాయి.

ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యాల మధ్య మొదలైన యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే.. దాని ప్రభావం కార్ల విడిభాగాల మీద పడుతుందని చెబుతున్నారు. చమురు.. సహజ వాయువు మీద ఐరోపా దేశాలన్ని రష్యా మీదనే ఆధారపడతాయని తెలుసు కానీ.. కార్లలోనూ.. చిప్ లలో వినియోగించే ప్లాటినమ్.. రోడియం.. పల్లాడియం లాంటి అరుదైన లోహాలు రష్యాలోనే ఎక్కువగా దొరుకుతాయన్న విషయం చాలా మందికి తెలీదు. వీటి కోసం ప్రపంచంలోని చాలా దేశాలు రష్యా మీదనే ఆధారపడతాయి.

యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే.. వాహనాల తయారీలో వినియోగించే ఈ లోహాల కొరత పెరగటం ఖాయం. బీఎస్ 6 కాలుష్య ప్రమాణాల ప్రకారం ఇంజిన్లు రూపొందించేందుకు ఈ లోహాల్ని వాహన కంపెనీలు వినియోగిస్తుంటాయి. వీటి కోసం రష్యా.. దక్షిణాఫ్రికాల మీదనే ప్రపంచ దేశాలు ఆధారపడతాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. యుద్ధం మరింతకాలం కొనసాని.. లోహాల ఉత్పత్తి మీద ప్రభావం పడితే.. దాని ఎఫెక్టు కార్ల తయారీ మీద పడుతుందని.. దీంతో ఇప్పటికే ఉన్న వెయిటింగ్ పిరియడ్ మరిన్ని నెలలు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎక్కడో రెండు దేశల మధ్య జరిగే యుద్దం ప్రపంచ ప్రజల మీద ఎలా ప్రభావం చూపుతుందో ఇట్టే తెలుస్తుంది కదూ?
Tags:    

Similar News