ఓవ‌ర్ వ‌ర్క‌వుట్స్‌.. గుండెను పిండేస్తున్నాయా?

Update: 2022-02-21 10:39 GMT
అధికార వైసీపీ నాయకుడు, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రా లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  50 ఏళ్ల ఆయన సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు అపోలో ఆసుపత్రి అధికారులు అధికారికంగా ప్రకటించారు.

గౌతమ్ రెడ్డి స‌హ‌జంగా ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తి. ఎంత బిజీగా ఉన్నా ఆయ‌న వ‌ర్క‌వుట్స్ చేయ‌కుండా మాత్రం ఉండ‌రు. దినచర్య లో భాగంగా ఈ రోజు కూడా మంత్రి ఈ రోజు ఉదయం 7.30 గంటలకు తన జిమ్‌కు వెళ్లబోతున్నా రు. కానీ ఇంత‌లోనే ఆయ‌న‌ తన ఛాతీలో అసౌకర్యంగా భావించారు. అంతేకాదు.. ఈ క్ర‌మంలోనే  మంచం మీద పడిపోయారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన సెక్యూరిటీ స‌బ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు.. మేక‌పాటి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

గౌతమ్ వంటి ఫిట్‌నెస్ ఫ్రీక్, తన జిమ్ సెషన్‌లను ఎప్పుడూ కోల్పోలేదు. అయిన‌ప్ప‌టికీ..  అకస్మాత్తుగా మరణించారు. ఇటీవలే.. క‌న్న‌డ కంఠీర‌వ కుమారుడు పునీత్ రాజ్‌కుమార్, టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా ఘ‌ట‌న‌ల‌ను మ‌రిచిపోక ముందే.. గౌతం తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో క‌న్నీరై నిలిచారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే..  ఫిట్‌గా ఉన్నప్పటికీ ముగ్గురూ గుండెపోటుకు గురయ్యారు. ఇంతలో, నిపుణులు దీర్ఘకాలిక, విపరీతమైన వ్యాయామ శిక్షణ, ఈవెంట్లలో పోటీ చేయడం వల్ల గుండె దెబ్బతినడంతోపాటు లయ రుగ్మతలకు దారితీస్తుందని పేర్కొన్నారు. జన్యుపరమైన ప్రమాద కారకాలు ఉన్న వ్యక్తులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు.

 ఫిట్‌నెస్ కోసం చాలా సేపు క‌స‌ర‌త్తులు చేయ‌డం కూడా మన హృదయాలను గాయప‌రుస్తుందా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు పెరిగిపోయిన‌ప్పుడు స‌హ‌జంగానే స‌మాజంలో చ‌ర్చ సాగుతుంది. అయితే.. కేవ‌లం ఫిట్‌నెస్ కోసం చేసే క‌స‌ర‌త్తు వ‌ల్లే ఇలా పూర్తిగా జ‌ర‌గ‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, దీర్ఘకాలిక వ్యాయామం హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ప్ర‌భావం అయితేచూపిస్తుం ద‌ట‌. ఇదిలావుంటే, దుబాయ్‌లో వారం రోజుల పాటు పర్యటించిన గౌతంరెడ్డి ఆదివారం తిరిగివచ్చారు.

 గ‌త వారం రోజులుగా దుబాయ్‌లో ఉన్నారు. అక్క‌డ జ‌రిగిన పెట్టుబ‌డుల స‌ద‌స్సు లో మేక‌పాటి పాల్గొన్నారు.  ఆదివారం ఉద‌యం ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చిన మంత్రి మేక‌పాటి మంగ‌ళ‌వారం.. తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి.. ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంది. అదే విధంగా పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు సంబంధించి.. మంత్రివ‌ర్గ బృందానికి కూడా ఆయ‌న వివ‌రించాల్సి ఉంది. అయితే..అనూహ్యంగా ఆయ‌న గుండెపోటుకు గురికావ‌డం.. తుదిశ్వాస విడ‌వ‌డం.. కుటుంబాన్ని తీవ్రంగా క‌లిచి వేస్తోంది.

మాజీ ఎంపీ..నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడైన గౌతంరెడ్డి.. ఉన్న‌త విద్యా వంతుడు. అంతేకాదు. వివాద ర‌హితుడిగా రాజ‌కీయాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అంటేనే రెడ్డి డామినేష‌న్ రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. కానీ, మంత్రి మేక‌పాటి మాత్రం ఈ డామినేష‌న్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. గ‌తంలో త‌న తండ్రి రాజ‌మోహ‌న్ రెడ్డి మాదిరిగానే గౌతం రెడ్డి కూడా.. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం.. రాష్ట్ర రాజ‌కీయాల‌కు ఉప‌యోప‌డే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తప్పనిసరిగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం శిక్షణ మాడ్యూల్స్, అవకాశాలు, అవసరమైన వనరులపై  పూర్తి దృష్టిని కేంద్రీకరించేవారు. దీంతో ఆయ‌న‌ మంత్రిగా అనేక‌ ప్రశంసలు అందుకున్నారు. శాఖలో ఇప్పటికే 200 మంది శిక్షణ భాగస్వాములను ఎంపిక చేశామని, 202 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని గ‌తంలో ఆయ‌న చెప్పారు.

నవంబర్ 2, 1971లో జన్మించిన గౌతమ్ రెడ్డి హైదరాబాద్‌లోని బద్రుకా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి UKలో టెక్స్‌టైల్స్‌లో M.Sc పూర్తి చేశారు. ఆయనకు భార్య శ్రీకీర్తి, కుమారుడు అర్జున్ రెడ్డి, కుమార్తె అనన్యారెడ్డి ఉన్నారు.
Tags:    

Similar News