కమ్మరి రాజుపేరు చెబితే వనపర్తి వణుకుతోంది?

Update: 2019-10-04 05:23 GMT
అతడో సామాన్యుడు. ఆ మాటకు వస్తే.. అతని గురించి అతనుండే ఊళ్లో తప్పించి మరెవరికీ తెలీదు కూడా. అలాంటి సామాన్యుడు ఇప్పుడు అందరికి వణుకు పుట్టించటమే కాదు.. అతడి పేరు చెబితే చాలు భయపడిపోతున్నారు. పొద్దున పూట మామూలుగా ఉండే ఈ వ్యక్తి రాత్రి అయితే చాలు.. అతడిలో కొత్త మనిషి నిద్ర లేస్తాడు. తనకు ఎదురైన మేకల్ని ఎత్తుకొని వెళ్లే అతగాడు.. వాటి మెడను కొరికేసి.. రక్తాన్ని తాగేస్తాడు. ఉదయాన్నే తాను చంపిన మేకను తన భుజం మీదకు వేసుకొని వచ్చి.. సదరు మేక యజమాని ఇంటి దగ్గర పడేసి తన దారిన తాను పోతాడు.

ఇప్పటివరకూ 60 మేకల్ని ఇదే రీతిలో చంపి..రక్తాన్ని తాగేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పదో తరగతి వరకూ చదువుకున్న ఇతగాడు వనపర్తి జిల్లా సింగపేటకు చెందిన కమ్మరిరాజు. కొంతకాలం క్రితం వరకూ బాగుండేవాడని.. ఉన్నట్లుండి ఇలా తయారయ్యాడని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇలా.. మేకల్ని చంపి రక్తం తాగేస్తున్న వైనంపై పంచాయితీ పెట్టిన పెద్దలు.. అతడికి జరిమానా విధించేవారు. దానికి అతని తల్లిదండ్రులు కట్టేవారు. ఈ మధ్యన భారం పెరిగిపోవటంతో తమ వల్ల కాదని వారు చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు మేకల్ని ఇలా చేస్తున్న ఇతడు.. చిన్న పిల్లల్ని చేస్తే సంగతేమిటన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. అంతేకాదు.. కమ్మరి రాజు ఇంటి పరిసరాల్లోని వారైతే.. అతడికి ఎదురుపడటానికి కూడా భయపడుతున్నారు. ఇంట్లో నుంచి రావటానికి జంకుతున్నారు. అయితే.. తాను ఇలా ఎందుకు చేస్తున్నానో తెలీదని అతడు చెబుతున్నట్లు కొందరు చెబుతున్నారు. రాజును మానసిక వైద్యశాలకు పంపాలని గ్రామపంచాయితీ తీర్మానం చేశారు. ఇతగాడి ఉదంతం ఊరిని దాటి ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News