హోదా కోసం పురుగుల మందు తాగేశాడు

Update: 2018-05-24 04:20 GMT
ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం త‌పిస్తున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు త‌గ్గట్లే.. తాజాగా ఒక ఉదంతం చోటు చేసుకుంది.  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను ప‌ట్టించుకోని మోడీ స‌ర్కారు పుణ్య‌మా అని.. హోదా కోసం ఆంధ్రోళ్ల ఆందోళ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. గ‌డిచిన కొన్నేళ్లుగా ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌లు విధాలుగా నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చేప్టిన సంగ‌తి తెలిసిందే.

గ‌డిచిన నాలుగేళ్లుగా ఏపీలో హోదా కోసం ఒకే వాద‌న‌ను వినిపించిన నేత‌గా జ‌గ‌న్ ను చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా హోదా కోరుతూ ఏపీకి చెందిన ఒక వ్య‌క్తి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన వైనం సంచ‌ల‌నంగా మారింది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన బెజ‌వాడ శ్రీ‌నివాస‌రావు హోదా సాధ‌న కోసం త‌న‌కు తానుగా ఆత్మార్ప‌ణ చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

నూజివీడుకు స‌మీపంలోని బొద్ద‌న‌ప‌ల్లి పంచాయితీ శివారు శోభ‌నాపురం గ్రామానికి చెందిన 55 ఏళ్ల శ్రీ‌నివాస‌రావు అగిరిప‌ల్లి త‌హ‌సీల్దార్ కార్యాల‌యానికి చేరుకున్నారు. ప్ర‌త్యేక హోదా కోసం పురుగుల మందును తాగాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది.. ఆయ‌న‌కు వైద్య సాయాన్ని అందించారు.

తాను ప‌రుగుల మందు తాగింది హోదా కోస‌మేనంటూ త‌న వెంట తెచ్చుకున్న లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని వెంక‌న్న సాక్షిగా మాట ఇచ్చి మోసం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హోదా సాధ‌న‌కు జ‌న‌సేన‌.. వైఎస్సార్ కాంగ్రెస్ లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన శ్రీ‌నివాస‌రావును హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అప‌స్మార‌క స్థితిలో ఉన్న ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News