ట్విట్టర్ ట్రెండింగ్ లో అమరావతి

Update: 2015-10-22 04:08 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఎంతగా ప్రజల్లోకి వెళ్లిందనటానికి సామాజిక మాధ్యమాల మీద దృష్టి సారిస్తే ఇట్టే తెలిసిపోతుంది. అమరావతి శంకుస్థాపన గురించి ఒక్క తెలుగువారు మాత్రమే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాలకు చెందిన వారు మాట్లాడుతున్నారు. ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి దేశంలోని వివిధ రాష్ట్రాల వారు మాత్రమే కాదు.. పలు దేశాలకు చెందిన వారు సైతం ఆంధ్ర గురించి మాట్లాడుకోవటం కనిపిస్తుంది. ట్విట్టర్ ట్రెండింగ్ లో ఈ రోజు పాపులర్ అయిన అంశాల్లో హ్యాష్ ట్యాగ్ మన అమరావతి అన్న అక్షరాల్ని టైప్ చేస్తే చాలు.. బోలెడన్ని ఫోటోలు కనిపిస్తాయి. అంతకు రెట్టింపు మెసేజ్ లు కనిపిస్తాయి.

అందరూ అమరావతి గురించి మాట్లాడేవారు. అక్కడ జరుగుతున్న శంకుస్థాపన గురించి విశేషంగా చెప్పుకునేవారే. జరుగుతున్న కార్యక్రమ విశేషాల్ని దగ్గర నుంచి గమనించటమే కాదు.. అబ్బురంగా మాట్లాడుకోవటం కనిపిస్తుంది. శంకుస్థాపన కార్యక్రమం ఇంత భారీగానా అన్న మాట వారి ట్వీట్లలో కనిపించేస్తుంది.

అంతేకాదు.. అభివృద్ధి దిశగా.. కొత్త రాజధానిని అద్భుతంగా రూపొందించుకోవాలన్న సంకల్పంతో ముందుకెళుతున్న ఏపీ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ.. ఆల్ ద బెస్ట్ అని చెప్పే ఎంతో మంది కనిపిస్తారు. కాకుంటే.. కాస్త శ్రమపడి ట్విట్టర్ వరకూ వెళ్లి హ్యాష్ టాగ్ కొట్టి మన అమరావతి అన్న మాట టైప్ చేస్తే చాలు.. లోకం ఏమనుకుంటుందో తెలిసిపోతుంది.
Tags:    

Similar News