ముద్ర‌డ‌గ మాట‌..ఇదే చివ‌రి చాన్స్ బాబు

Update: 2017-04-13 09:35 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మ‌రోమారు మండిప‌డ్డారు.  బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు కల్పించాలని, కాపులకు బీసీ కేటగిరీలోనే ప్రత్యేక రిజర్వేషన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాపు రిజర్వేషన్ల హామీని వచ్చే నెల 7లోగా నిలబెట్టుకోవాలని ముద్రగడ పద్మనాభం అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే అదేరోజు కాపు జేఏసీతో సమావేశమవుతామని, అనంత‌రం ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేస్తామ‌ని తెలిపారు.

ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలను చంద్రబాబు గ్రహించాలని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం హితవు పలికారు. మంజునాథ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెరవేర్చాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాపు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికే చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారని ముద్ర‌గ‌డ ఆరోపించారు. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసే కుట్రలు చేస్తున్నారని, కాపు సోదరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాపులకు న్యాయం చేయాలని కోరుతూ...త్వరలోనే పాదయాత్ర చేపడతానని, విధివిధానాలు కూడా ప్రకటిస్తానని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం తెలిపారు. ఒక‌వేళ కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తే తమ తరపున ఐదుగురిని పంపిస్తామని ఆయ‌న ప్ర‌తిపాద‌న పెట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News