7వేల కోట్ల కుమ్మరింత.. మోడీ వస్తున్నాడు మరీ

Update: 2023-01-09 23:30 GMT
ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ గగ్గోలు పెడుతున్నాడు. అసలు తెలంగాణ నుంచి తీసుకుపోవడం తప్పితే ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తూనే ఉంటాడు. కేటీఆర్ నుంచి మొదలుపెడితే మంత్రుల వరకూ ఇదే మాట.. దీంతో తెలంగాణ బీజేపీ నేతలకు తల కొట్టేసినంత పని అవుతోంది. అయితే వచ్చే ఏడాదియే ఎన్నికలు ఉండడంతో మేం పనిచేశామని చెప్పుకోవడానికి బీజేపీ కాసిన్ని పనులు చేయాలి. అందుకే తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై పడింది.

ఈ ఏడాదియే తెలంగాణతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ కూడా తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అందుకే తెలంగాణలో ఏదో చేశామని చెప్పుకోవడానికి ప్రధాని మోడీ వస్తున్నారు.

ఈనెల 19న ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్నింటిని ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలో తెలంగాణలో అడుగుపెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ హైదరాబాద్ పర్యటనకు కారణం ప్రజలను మచ్చిక చేయడమేనని.. తెలంగాణకు ఏం చేయలేదన్న అపవాదును పోగొట్టుకోవడానికే ఈ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ పర్యటనలో దాదాపు 7000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీని విలువ 699 కోట్లు. అలాగే వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తారు. వందేభారత్ సిరీస్ లో ఇది 8వ  ట్రైయిన్ కావడం విశేషం. సికింద్రాబాద్ విజయవాడ మధ్య ఈ ఎనిమిదో ట్రెయిన్ నడువనుంది.

అయితే దక్షిణమధ్య రైల్వే కేంద్రం సికింద్రాబాద్ లో రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు నాటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గద్దెనెక్కిన 9 ఏళ్లకు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ మోడీ ఈ పనులను ప్రారంభించనున్నారు. అంతే తప్ప తెలంగాణపై ప్రేమతో కాదని కాంగ్రెస్, టీఆర్ఎస్ లు తప్పుపడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News