పాద‌యాత్ర‌పై ఈ నిఘా ఎందుకు బాబు!

Update: 2017-11-13 10:12 GMT
జ‌నం.. ఎక్క‌డ‌చూసినా జ‌న ప్ర‌వాహం.. ఇసుక వేస్తే రాల‌నంత ప్ర‌భంజ‌నం.. వైఎస్సార్‌ సీపీ అధినేత - ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి చేప‌ట్టిన `ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌`కు అన్ని వర్గాల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది! ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని, ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ చేప‌ట్టిన యాత్ర‌కు స్పంద‌న అంతంత‌మాత్రంగానే ఉంటుంద‌ని టీడీపీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబు భావించారు. కానీ అశేష జ‌న‌వాహినిని చూసిన త‌ర్వాత‌.. ఆయ‌న‌లో టెన్ష‌న్ మొద‌లైంది. అందుకే జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై ప్ర‌త్యేక నిఘాను ఆగ‌మేఘాల‌పై పెట్టారు. టెక్నా ల‌జీ మంత్రం జపిస్తున్నఆయ‌న‌.. జ‌గ‌న్‌ను యాత్ర‌లోనూ దీనిని ఉప‌యోగించుకుంటున్నారు. అంతేగాక పోలీసులు - ఇంటెలిజెన్స్‌ అధికారుల‌తో సీక్రెట్ స‌ర్వేలు నిర్వ‌హించి.. నివేదిక‌లు తెప్పించుకుంటున్నార‌ట‌.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గట్టేందుకు ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ చేస్తున్న ప్రజా సంక‌ల్ప యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణతో టీడీపీ నాయ‌కుల్లో వ‌ణుకు మొద‌లైంది. మొద‌ట్లో దీనిని `లైట్` తీసుకున్నవారంతా ఇప్పుడు తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబులో ఈ స్థాయి మ‌రింత‌ దాటింది. అందుకే  ప్రజా సంకల్ప యాత్రపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ నివేదిక‌త‌పై సీఎం చంద్రబాబు ప్రతి రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నార‌ట‌. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో రోజూ రీజనల్‌ ఇంటెలిజెన్స్‌ ఆర్‌ ఐవో నరహరి పాల్గొంటున్నారు. వైఎస్‌ జగన్‌ వెళ్లే ప్రాంతానికి ముందుగానే చేరుకుని పరిస్థితులు ప‌రిశీలిస్తున్నారు.

జగన్‌ పాదయాత్ర ముగిశాక కూడా జనం ఏమనుకుం టున్నారనే దానిపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి అయిన నరహరితో పాటు మరికొందరు అధికారులు జనంలో క‌లిసిపోతున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ఎవరెవరు ఏమనుకుంటున్నారో ఆరా తీస్తున్నార‌ట. ఇక పాదయాత్ర మొదటిరోజు కనిపించని నిఘా కెమెరాలు మూడో రోజు నుంచి పోలీసుల చొక్కాలకు వేలాడుతున్నాయి. యాత్రకు ఏయే వర్గాల ప్రజలు వస్తున్నారు? ఎవరెవరు జగన్‌ ను కలుస్తున్నారు? వ‌ంటి అంశాలు చిత్రీక‌రించ‌డ‌మే వీరిప‌ని! అంతేగాక టీడీపీ నాయకులు ఎవరైనా వైఎస్‌ జగన్‌ ను కలుస్తున్నారా? అనేది ఆరా తీస్తున్నార‌ట‌.

మరోవైపు డ్రోన్‌ కెమెరాలతో బహిరంగ సభ దృశ్యాలతో పాటు పాదయాత్రలో భారీగా తరలివస్తున్న జనాలను చిత్రీకరిస్తున్నారు. వీటిని సచివాలయంలోని పెద్దలు నేరుగా లైవ్‌ లో చేసేలా ఏర్పాట్లుచేశార‌ట‌. వివిధ శాఖలు - ప్రైవేటు వ్యక్తులు జగన్‌ పాదయాత్రపై స‌మాచారాన్ని సేకరించి అమరావతికి నివేదిక పంపుతున్నార‌ట‌. నివేదిక - వీడియోలపై రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత.. దానికిగల కారణాలపై విశ్లేషించినట్లు ఓ అధికారి వివ‌రించారు.
Tags:    

Similar News