గుడికి వచ్చిన భక్తురాలిని చంపేసిన పూజారి.. హైదరాబాద్ లోనే ఈ ఘోరం

Update: 2022-04-23 02:31 GMT
మనుషులు.. వారి మనస్తత్వాలు మారిపోతున్నాయి. గతంలో నేరాలు.. ఘోరాలు పాల్పడేవారికి సంబంధించి కొంత విభజన రేఖ ఉండేది. ఇప్పుడు అది కాస్తా పోయింది. సమాజంలో గౌరవ మర్యాదలకు ఏ మాత్రం లోటు లేకుండా ఉండేవారు సైతం దారుణాలకు పాల్పడుతున్న వైనం చూస్తే ఒళ్లు జలదరించక మానదు. తాజాగా అలాంటి ఉదంతమే హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో చోటు చేసుకుంది. ఇటీవల ఒక పెద్ద వయసు మహిళ గుడి వెనుక హత్యకు గురయ్యారు. ఈ కేసును చేధించేందుకు మల్కాజ్ గిరి ఎస్ ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు.

తీరా చూస్తే.. ఈ హత్యకు కారణమైనోడి గురించి తెలిసినంతనే షాక్ తిన్నారు. దీనికి కారణం.. సదరు మహిళను హత్య చేసింది మరెవరో కాదు.. అక్కడి గుళ్లో పూజారిగా సేవలు అందించేటోడే దారుణంగా హత్య చేసిన వైనాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

స్థానికంగా పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఏప్రిల్ 18న సాయంత్రం మల్కాజిగిరి పోలీస్ స్టేషణ్ పరిధిలో ఉండే 56 ఏళ్ల ఉమాదేవి స్వయంభూ వినాయక ఆలయానికి.. శివపురి కాలనీ శివాలయానికి వెళ్లారు. గుడికి వెళ్లిన ఆమె ఎంతసేపటికి రాలేదు. దీంతో.. ఆమె కోసం గాలించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో గుడి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమేరాల పుటేజ్ ను పరిశీలించిన వారికి కుళ్లిపోయిన దశలో ఉన్న ఉమాదేవి డెడ్ బాడీ కనిపించింది. వెంటనే.. వారి కుటుంబ సభ్యులకుసమాచారం అందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనుకున్నట్లే డెడ్ బాడీని ఉమాదేవిదిగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ లో ఉమాదేవి గుడికి వచ్చినట్లుగా గుర్తించారు.

ఆమె చెప్పులు సైతం గుడి వద్ద ఉండటం.. తర్వాతి రోజు మాయం కావటాన్ని గుర్తించారు. ఉమాదేవి మిస్ అయిన రోజు నుంచి గుడి పూజారి కనిపించకుండా పోవటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూజారి కోసం గాలించి.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా హత్య చేసింది తానేనని ఒప్పుకున్నారు. బంగారు నగల కోసం కన్నేసిన పూజారి.. ఉమాదేవిని ఆక్షింతలు వేయించుకోవటానికి గుడి వెనక్కి రావాలని చెప్పాడు. ఆయన మాటల్ని నమ్మిన ఆమె వెళ్లటంతో రాడ్ తో తల మీద కొట్టి.. బంగారాన్ని తీసుకొని పారిపోయాడు. పూజారి చెప్పిన మాటలకు పోలీసులు సైతం  షాక్ కు గురైనట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News