చూసుకోకుండా బస్సు ఎక్కారో.. జాగ్రత్త

Update: 2019-05-15 08:42 GMT
అన్ని బస్సులు ఒకేలా ఉండవు.. ఆర్టీసీ బస్సులంతా సురక్షితం కాదు.. కొందరు డబ్బు ఆశతో అర్హత లేని ప్రైవేటు డ్రైవర్లను తీసుకొచ్చి ట్రావెల్స్ నడిపిస్తుంటారు. వారు వందల ప్రయాణికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. గమ్యస్థానానికి చేరుకోవడం దేవుడెరుగు.. ప్రాణాలపై ఆశలు కూడా చంపుకోవాల్సిందే..  తాజాగా కొన్ని ప్రైవేటు ట్రావెల్స్  అర్హత లేని డ్రైవర్లను - తాగుడికి బానిసైన వారిని డ్రైవర్లుగా నియమించి ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయి.  ప్రైవేటు బస్సు డ్రైవర్ల నిర్వాకం వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది.

తాజాగా కృష్ణ జిల్లా కంచికచర్ల దగ్గర హైవేపై  డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దారుణం వెలుగుచూసింది. ప్రైవేట్ బస్సుల డైవర్లను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా.. పోలీసులకు దిమ్మదిరిగే ఫలితం వచ్చింది. ప్రైవేటు బస్సుల డ్రైవర్లు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తుండడం పోలీసుల తనిఖీల్లో తేలింది. దీంతో పోలీసులే షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ఒకరో ఇద్దరో అయితే పర్లేదు.. ఏకంగా వెంకటపద్మావతి - జీవీఆర్ - కనకదుర్గ ట్రావెల్స్ డ్రైవర్లు కూడా మద్యం తాగి బస్సులు నడుపుతున్నట్లు తేలడంతో పోలీసులు నివ్వెరపోయారు. ట్రావెల్స్ డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు..

కాగా వందల మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ల వ్యవహారశైలిపై ప్రయాణికులు మండిపడ్డారు. మద్యం తాగి బస్సులు నడుపుతారా అని నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రయాణికులు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనే విషయం తెలుసుకొని ప్రయాణిస్తే మేలు అని పోలీసులు సూచిస్తున్నారు. 
Tags:    

Similar News