యువరాజు ప్రకటించిన యువరాజు ఎవరంటే?

Update: 2017-10-10 05:00 GMT
ఈ దేశంలో ఇప్పటిదాకా ‘యువరాజు’ అనే పదానికి అర్హుడైన వ్యక్తి ఒకే ఒక్కనాయకుడు అని అందరూ అనుకుంటున్నారు. ఆయన మరెవ్వరో కాదు.. కాంగ్రెస్ పార్టీ తరఫున ‘‘ఈ దేశానికి కాబోయే ప్రధాని ’’ అనే ట్యాగ్ లైన్ కలిగి ఉన్న రాహుల్. అయితే ఇప్పుడు తమాషా ఏంటంటే.. వందేళ్ల పైబడిన చరిత్ర గల తన పార్టీలోని వారంతా తననే యువరాజుగా కీర్తిస్తోంటే.. ఆయన మాత్రం.. మరో కుర్రాడిని యువరాజుగా అభివర్ణిస్తున్నారు. రెండో వ్యక్తిని ‘యువరాజు’గా అభివర్ణించడంలో రాహుల్.. తనకు వీలైనంత సెటైర్ ను కూడా జోడిస్తున్నారు. అయితే ఆ కొత్త యువరాజు మరెవ్వరో కాదు.. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జే షా. ఆయన తండ్రి హోదాను అడ్డు పెట్టుకుని వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకువెళ్లాడంటూ వెబ్ సైట్ లో వచ్చిన కథనాల గురించిన పర్యవసానాల్లో ఈ సెటైర్లు నడుస్తున్నాయి.

అమిత్ షా కొడుకు జే షా.. రూ.50 వేల నుంచి మూడేళ్లలో తన కంపెనీల టర్నోవర్ ను 80 కోట్ల రూపాయలకు అంటే 16వేల రెట్లు పెంచేశాడంటూ వైర్ అనే వెబ్ సైట్ పరిశోధనాత్మక కథనాల్ని అందించింది. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా ఉంది. అమిత్ షా వైఖరిని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ ఈ వ్యవహారాన్ని గరిష్టంగా హైలైట్ చేస్తోంది. ప్రధాని ఎప్పటిలాగానే మౌనం పాటిస్తున్నారు. అయితే ప్రధాని ఈ విషయంలో స్పందించి ప్రకటన చేయాలని, అమిత్ ను  పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్లు మిన్నంటుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో సోనియా అల్లుడు దోపిడీపర్వం సాగించిన చందంగానే.. భాజపా హయాంలో అమిత్ కొడుకు ఎదుర్కొంటున్న ఆరోపణలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో రాహుల్ ట్వీట్ల ద్వారా ప్రధాని మోడీని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోడీ ఇప్పటికైనా మౌనం వీడి స్పందించిచ ఏదో ఒకటి చెప్పాలని రాహుల్ ట్వీట్ ద్వారానే ఆయనను అడిగారు. అయితే ఈ వ్యవహారంలో భాజపాకు చెందిన కేంద్రమంత్రులు యావత్తూ... అమిత్ షాకు బాసటగా నిలుస్తున్నారు. అవన్నీ అసత్య కథనాలంటూ కొట్టి పారేస్తున్నారు. అనవసరంగా బురద చల్లుతూ.. అసలు విషయాలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్ర జరుగుతోందని అధికారపార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే అమిత్ కొడుకు జేఅమిత్ షా తరఫున వాదించడానికి ఏకంగా ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయవాదిగా నియమించుకోవడం కూడా వివాదంలో అంశంగానే మారుతోంది. ఆయన మాత్రం టెక్నికల్ కారణాలు చూపి.. ప్రెవేటు కేసులు కూడా వాదించుకోవచ్చని అంటున్నారు.
Tags:    

Similar News