టిఫినీలకు ఇంటికొస్తే మరీ అంత అలుసా?

Update: 2016-01-10 07:29 GMT
ఆశకు హద్దుండాలి. రెండు రైళ్ల పట్టాలు కలుస్తాయా? భూమి ఆకాశం ఏకమవుతుందా? ఇదెలా అసాధ్యమో.. కమ్యూనిస్టులు.. కమలనాథులు ఒక్కటి కావటం సాధ్యమే కాని విషయం. కలలో కూడా సాధ్యం కాని ఈ వ్యవహారాన్ని నిజం చేయాలన్న ప్రయత్నం చేశారు తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావు. తన ఇంటికి అల్పాహార విందుకు ఆహ్వానించటం.. ఆయన మాట కాదనలేక రాయపాటి ఇంటికి కమ్యూనిస్టులు క్యూ కట్టారు.

ఈ అల్పాహార విందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సహా పలువురు జాతీయ నేతలు రాయపాటి ఇంటికి వచ్చారు. వారందరిని చూసిన ఆయన మురిసిపోయారు. ఆ సంతోషాన్ని అలానే అట్టి పెట్టుకొని ఉంటే బాగుండేది. అత్యాశకు పోయిన ఆయన.. కమ్యూనిస్టులతో వియ్యం కోసం ప్రయత్నించారు.  టీడీపీతో కలిసి పని చేయొచ్చుగా అంటూ మనసులోని కోరికను బయటపెట్టారు.

బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న టీడీపీతో చేతులు కలపడమా? ఏమనుకుంటున్నారు? ఎంత టిఫినీలు తినేందుకు పిలిస్తే మాత్రం.. వెనుకా ముందు లేకుండా అడిగేయటమేనా? బీజేపీతో కలిసిన మీతో మాకు బంధమా అంటూ రాయపాటికి సురవరం క్లాస్ పీకినట్లుగా చెబుతున్నారు. దీంతో.. లోపల ఉడికిపోతున్నా.. పైకి మాత్రం నవ్వుతూ వారిని సాగనంపారని చెబుతున్నారు.
Tags:    

Similar News