పవన్‌ సెక్షన్‌ 8 వద్దన్నది అందుకేనా...?

Update: 2015-07-08 09:27 GMT
రెండు తెలుగు రాష్ట్రాల వివాదాలపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న పవన్‌ కళ్యాణ్‌ సెక్షన్‌ 8 అమలు అవసరం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే... ఆయన ఆ మాటను ఏదో ఆషామాషీగా అనలేదని.. దాని వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సనత్‌నగర్‌ ఉప ఎన్నిక జరిగితే పవన్‌ అక్కడ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన సెక్షన్‌ 8 వ్యాఖ్యలకు కొత్త అర్థాలు వస్తున్నాయి. బీజేపీ ఉద్దేశాన్నే పవన్‌ బయటపెట్టారని.. ఆయన ఇంకా బీజేపీ చేతిలోనే ఉన్నారనడానికి అదే నిదర్శనమని చెబుతున్నారు. అంతేకాదు.. బీజేపే మద్దతుగా పవన్‌ సనత్‌ నగర్‌ బరిలో దిగడం ఖాయమని.. అందుకే ఆయన ఆ వ్యాఖ్య చేశారని చెబుతున్నారు. అంతేకాదు... జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పవన్‌ను బీజేపీ ఫుల్లుగా వాడుకునే ఆలోచనలో ఉందని... సెక్షన్‌ 8 వద్దని అన్న పవన్‌ హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రజల్లో తనకున్న ఆదరణను అలాగే కాపాడుకోవడానికి అది ఉపయోగపడిందని చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రజల విషయానికొస్తే సామాజిక సమీకరణాలు, సినీ అభిమానాన్ని పరిగణిస్తే సెక్షన్‌ 8 వ్యాఖ్యల వల్ల పవన్‌కు హైదరాబాద్‌లోని ఆంధ్రవాళ్ల పరంగా ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు.

    పవన్‌ స్పీచ్‌ తయారీ వెనుక ఓ బీజేపీ ప్రముఖుడు ఉన్నారని... పవన్‌ మీడియా ముందుకు రావడానికి ముందే ఆయన ప్రసంగానికి బీజేపీ ఆమోదం లభించిందని కూడా తెలుస్తోంది. మోడీతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో తెలంగాణ బీజేపీ వర్గాలు పవన్‌ను బాగానే చూసుకుంటున్నాయని... పైగా ఆయన వ్యాఖ్యలు, విధానాలు బీజేపీకి అనుకూలంగానే ఉండడంతో సనత్‌నగర్‌లో పవన్‌ బీజేపీల కాంబినేషన్‌ వర్కవుటుతుందని భావిస్తున్నారు. కొద్ది రోజుల్లో పవన్‌ ట్విట్టర్‌ వేదికగా సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, టీఆరెస్‌ మంత్రి తలసానిపై వ్యాఖ్యలు చేస్తారని... దానికి తలసాని రెస్పాండయ్యాక పవన్‌ మీడియా ముందుకొచ్చి కాస్త డీటెయిల్డ్‌గా ప్రజలకు తన ఆలోచనలు అర్థమయ్యేలా... పోటీ విషయంలో తానే స్వయంగా సంకేతాలు ఇచ్చేలా నేరుగా స్పందిస్తారని సమాచారం. మొత్తానికి పవన్‌ బీజేపీ దన్నుతో బాగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్లున్నారు.
Tags:    

Similar News