పులివెందులలో షర్మిల ఒంటరి అయిందా?

Update: 2021-03-15 08:28 GMT
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్న వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా తాను ప్రజల ముందుకు రాబోతున్నానని షర్మిల ప్రకటించారు. అయితే, షర్మిల పార్టీ పెట్టాలన్న నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకించారని - పార్టీ పెట్టొద్దంటూ వారించారని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే షర్మిల కూడా తెలంగాణలో తన రాజకీయం తనదని - ఏపీలో జగన్ అన్న రాజకీయం జగన్ అన్నదేనని చెప్పేశారు.

అయితే, ఈ పార్టీ విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని పుకార్లు వినిపించినా...వాటిని వైసీపీ నేతలు ఖండించారు. అవి అభిప్రాయ భేదాలేనని - అన్నా చెల్లెళ్ల అనుబంధం..కుటుంబంలో సంబంధబాంధవ్యాలు వేరు...రాజకీయాలు వేరని కొట్టిపారేశారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఘటన నేపథ్యంలో ఆ కుటుంబంలో వైఎస్ షర్మిల ఒంటరి అయ్యారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

పులివెందులలో షర్మిల ఒంటరి అయ్యారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి - దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద షర్మిల ఒంటరిగా - ఏకాకిలా కూర్చున్న ఫొటోపై ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మామూలుగా అయితే - షర్మిల వచ్చినపుడు ఆమె వెంట వైసీపీ కార్యకర్తలు - అభిమానులు - వైసీపీ శ్రేణులు - వైసీపీకి చెందిన కొందరు లోకల్ నాయకులు ఉండేవారు.

కానీ, తాజా ఫోటోలో షర్మిత తన తండ్రి సమాధి వద్ద ఒంటరిగా కూర్చొని ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. షర్మిల వెంట జగన్ బంధువులు కానీ - కేడర్ కానీ ఎవ్వరూ రాలేదు. షర్మిల వెంట కేడర్ - కార్యకర్తలు - బంధువులు ఎవరూ వెళ్లకూడదని వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే - వైఎస్ ఆర్ ఘాట్ లో షర్మిల పర్యటనకు వైసీపీ శ్రేణులు దూరంగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

మరి, ఈ ప్రచారంలో - పుకార్లలో వాస్తవ అవాస్తవాలెంతన్నది పక్కన బెడితే...కొత్త పార్టీ వ్యవహారం వైఎస్ కుటుంబంళో కొంత గ్యాప్ తెచ్చిందన్న మాట పులివెందులలో వినిపిస్తోంది. మరి, ఈ వ్యవహారంపై వైఎస్ కుటుంబ సభ్యులు - వైసీపీ నేతలు స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News