కిరణ్ కుమార్ రెడ్డి నోట షాకింగ్ నిజం రివీల్.. వైఎస్ మాటకు నో చెప్పారా?

Update: 2022-11-26 04:33 GMT
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరు కిరణ్ కుమార్ రెడ్డి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును మాటలతో ఒక ఆట ఆడుకునే నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మాటలు ఎంత వాడిగా.. వేడిగా.. సూటిగా.. స్పష్టంగా.. చురుగ్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ సిరీస్ లో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అతిధిగా హాజరు కావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో షాకింగ్ నిజాన్ని.. బయట ప్రపంచానికి తెలియని విషయాన్ని వెల్లడించారు. బాలయ్యకు కిరణ్ కుమార్ రెడ్డి చిన్ననాటి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.

దివంగత మహానేత వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై మరణించటం తెలిసిందే. నిజానికి సదరు హెలికాఫ్టర్ లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉండాల్సిన విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. వైఎస్ చెప్పిన మాటకు తాను నో చెప్పటమే తనను వైఎస్ తో పాటు ప్రయాణానికి వెళ్లకుండా ఆగాల్సి వచ్చిందంటూ కొత్త విషయాన్ని వెల్లడించారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రిగా చేయటంస్వల్ప కాల వ్యవధిలోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం.. ఆయన ఎంతగా వ్యతిరేకించినా కూడా రాష్ట్ర విభజన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే.. అసెంబ్లీ స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించేవారు. స్పీకర్ కు సాధారణంగా పలు హౌస్ కమిటీలు వేసే వీలు ఉంటుంది.అంతేకాదు.. పీఏసీ కమిటీలో ప్రతిపక్షం సూచించే సభ్యుడికే ఛాన్సు ఇవ్వటం జరుగుతుంది. అయితే.. అప్పట్లో సీఎం వైఎస్ తనకు ఫోన్ చేసి.. పీఏసీ కమిటీని నియమించారా? అని అడిగారని.. ఆ సమయానికి టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

అయితే.. వైఎస్ మాత్రం ఆ పేరును పెక్కనపెట్టి.. శోభానాగిరెడ్డికి అవకాశం ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. వైఎస్ తనకు ఫోన్ చేసినప్పుడు ఒక సీనియర్ మంత్రి ఆయన పక్కన ఉన్న విషయాన్ని అర్థం చేసుకున్న తాను.. 'సార్ మీ పక్కన ఆ వ్యక్తి ఉన్నాడా? అని అడిగానని.. దానికి వైఎస్ అవును.. ఎందుకు? అని అడిగారు' అంటూ నాటి విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు.

దీంతో తాను ప్రస్తుతానికి కమిటీలు వేయటం లేదని.. స్వయంగా కలిసి మూడు కమిటీల జాబితాను చూపిస్తానని.. వైఎస్ ఓకే చెప్పిన తర్వాతే వాటిని మార్చాలా? ఓకే చేయాలా? అన్న నిర్ణయాన్ని తీసుకోవాలని కోరినట్లుగా పేర్కొన్నారు. అయితే.. కమిటీలను తర్వాతి రోజుకు పూర్తి చేయాల్సి ఉండటంతో తాను తప్పనిసరిగా స్పీకర్ చాంబర్ కు వెళ్లాల్సి వచ్చిందని.. దీంతో వైఎస్ తో కలిసి తాను రచ్చబండ కార్యక్రమానికి వెళ్లలేకరపోయినట్లు చెప్పారు.

కమిటీల ఎంపిక పూన్తి చేయాలని వైఎస్ చెప్పటంతో ఆగినట్లు చెప్పారు. తాను జాబితాను సిద్ధం చేసి.. తాను అధికారులకు ఫోన్ చేసి రచ్చబండ కార్యక్రమానికి సీఎం వైఎస్ చేరుకోలేదని చెప్పటం.. దీంతో ఏదో అయ్యిందన్న సందేహానికి గురయ్యామని.. ఆ తర్వాత ప్రమాదంలో ఆయన చనిపోయిన వైనం బయటకు వచ్చిందంటూ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన నోటి నుంచి వచ్చిన ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News