మోడీ, బాబు....పెద్ద తప్పు

Update: 2015-12-05 16:32 GMT
ప్రధానమంత్రి నరేంద్రమోడీ - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి జోడి అని తెలుగు రాష్ర్టాల్లో పేరున్న సంగ‌తి తెలిసిందే. న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌ ను తీర్చిదిద్ద‌డంలో భాగంగా ఈ ఇద్ద‌రు నాయ‌కులు చేస్తున్న పనుల‌కు అదే రీతిలో కితాబులు కూడా ద‌క్కుతున్నాయి. కానీ ఈ ఇద్ద‌రిలో కామ‌న్ త‌ప్పిదం ఒక‌టి ఉంద‌ని తాజాగా ప్ర‌ముఖ స్వామీజీ తేల్చారు. న‌రేంద్ర‌మోడీ - చంద్ర‌బాబు నాయుడు సరైన సమయంలో ప్రమాణ స్వీకారం చేయకపోవడం వల్లే ఉపద్రవాలు వస్తున్నాయని విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆరోపించారు. ఉపద్రవాలు రాకుండా వారు శాంతియాగం నిర్వహించాలని ఆయన సూచించారు.

చంద్ర‌బాబు ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు చేయ‌డంలో స్వ‌రూపానందేంద్ర ముందుంటార‌నే పేరుంది. గ‌తంలో గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా త‌మ‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌లేద‌ని స్వరూపానందేంద్ర  ఆక్షేపించారు. భారతీయ సంస్కృతికి పునాదులు వేసి హిందూ మతోద్ధరణ కోసం పాటుపడుతున్న పీఠాలకు, పీఠాధిపతులకు మనుగడ లేకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని స్వరూపానందేంద్ర ఆరోపించారు. దిక్కుమాలిన ప్రభుత్వం ఇది ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు కూడా! కొద్దికాలం క్రితం ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలోని ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని...ఏపీ సర్కారు ఐదేళ్లు పరిపాలించదని శ‌పించారు. ఆ త‌ర్వాత కూడా బాబు స‌ర్కారుపై అడ‌పాద‌డ‌పా ప‌లు సంద‌ర్భాల్లో ఆక్షేపించిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల‌ ఏకంగా హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

గిరిజన ప్రాంతాలు భగవంతునితో సంబంధం ఉన్న ప్రదేశాలని పేర్కొంటూ విశాఖ‌లో బాక్సైట్ త‌వ్వ‌కంపై  అన్నారు. ప్రకృతి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకంతో గిరిజనుల జీవనశైలి, ఆ ప్రాంత ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదముందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాక్సైట్‌ నిక్షేపాలను పరిరక్షించాలని బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. ప్ర‌భుత్వ చ‌ర్య  దుర్మార్గమని విమర్శిస్తూ అందరూ దీన్ని ఖండించాలని కోరారు. మొత్తంగా స్వ‌రూపానందేంద్ర స్వామి ఆధ్యాత్మిక అంశాల‌కంటే రాజ‌కీయ‌ప‌ర‌మైన విష‌యాల‌పైనే ఎక్కువ ఆస‌క్తి చూపిస్తున్నారని జోరుగా చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News