న‌గ్నచిత్రాల‌తో బెదిరించి దొరికిపోయిన మాజీ ఎంపీ?

Update: 2017-10-28 06:05 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నగ్న చిత్రాలున్నాయ్...బయటపెడతా...అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావుపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళను బెదిరించినట్లు నామాపై ఆరోపణలు ఉన్నాయి. నగ్న చిత్రాలున్నాయ్.. బయటపెడతానంటూ.. తనను మాజీ ఎంపీ నామా బెదిరిస్తున్నాడని బాధిత మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నామా నాగేశ్వర్‌ రావు - ఆయన సోదరుడు సీతయ్యపై కేసు నమోదైంది.

2013 నుంచి నామా నాగేశ్వర్‌ రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని బాధిత మహిళ తెలిపారు. ఈ ఏడాది మే - జూలై నెలల్లో నామా నాగేశ్వర్‌ రావుతో పాటు ఆయన సోదరుడు నామా సీతయ్య తన ఇంటికి వచ్చి దుర్భాషలాడారని, దాడికి దిగారని బాధిత మహిళ ఆరోపించారు. నామా తనను దూషించిన సెల్‌ ఫోన్‌ ఆడియో రికార్డులను - ఇంటికి వచ్చి దూర్భాషలాడిన వీడియోను సైతం ఫిర్యాదుకు ఆధారంగా జతపరిచినా...నామా ఒత్తిడి కారణంగా పోలీసులు ఇంతకాలం కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, నామా వేధింపులపై బాధితురాలు ఇటీవల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో పోలీసులు ఎఫ్‌ ఐఆర్‌ నమోదుచేసినట్టు తెలుస్తోంది.  ఐపీసీ 506 - 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు తనను మంత్రి నాగేశ్వర్‌ రావు పంపించాడంటూ నామా ప్రతి ఒక్కరికి చెబుతున్నారని, దానిపై క్షమాపణ చెప్పాలని తాను కోరినా పట్టించుకోలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tags:    

Similar News