బుద్ధా ప్ర‌శ్న‌!.. వ్య‌వ‌సాయం అంటే తెలుసా జ‌గ‌న్‌?

Update: 2017-10-16 02:59 GMT
విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న మ‌రోసారి వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై రెచ్చిపోయారు. ప‌లు ప్ర‌శ్న‌ల‌తో కూడిన బ‌హిరంగ లేఖ‌ను విప‌క్ష‌నేత‌కు సంధించారు. ప్ర‌స్తుతం ఈ లేఖ రాజ‌కీయంగా తీవ్ర సంచ‌ల‌నం సృష్టిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు దృష్టిలో ప‌డేందుకు విప‌క్షం వైసీపీపై ఒంటి కాలిపై రెచ్చిపోతున్నారు బుద్ధా వెంక‌న్న‌. గ‌తంలో బాబు కుమారుడు నారా లోకేష్‌ను మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటార‌ని వార్త‌లు వ‌చ్చిన సంద‌ర్భంలో త‌న ఎమ్మెల్సీ సీటును లోకేష్‌కు ఇస్తానంటూ వార్త‌ల్లో నిలిచి గుర్తింపు పొందిన బుద్ధా.. ఆ త‌ర్వాత మాత్రం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

తాజాగా భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబుకు విప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ ఓ లేఖ రాసిన విష‌యం తెలిసిందే. సీమ‌లో కురిసిన వ‌ర్షాల ప్ర‌భావంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని, పంట‌లు మునిగిపోయాయ‌ని జ‌గ‌న్ త‌న లేఖ‌లో వెల్ల‌డించారు. రైతుల‌ను ఆదుకోవాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. లేనిప‌క్షంలో మ‌ళ్లీ ఆత్మ‌హ‌త్య‌ల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆదివారం మ‌ధ్యాహ్నం బుద్ధా వెంక‌న్న.. జ‌గ‌న్‌కి లేఖ రాయడం గ‌మ‌నార్హం. త‌న లేఖ‌లో  జగన్‌పై  బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు.

రైతుల పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుమ్మెత్తి పోశారు. అసలు జగన్‌కు వ్యవసాయం అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 14500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రైతుల నుంచి పొలాల‌ను బలవంతంగా లాక్కోలేదా? అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ భూదాహానికి 3 లక్షల మంది రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు, లేఖ‌లు చూస్తుంటే.. దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టుగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ నోరు విప్పితే అబ‌ద్ధాలేన‌ని అన్నారు. మొత్తానికి బుద్ధా కౌంట‌ర్ ఎన్ని వివాదాల‌కు దారి తీస్తుందో చూడాలి.
Tags:    

Similar News