రేవంత్ ఎంత ఆయాసపడినా కాంగ్రెస్ ని లేపలేరా... ?

Update: 2022-11-08 10:30 GMT
తెలంగాణా కాంగ్రెస్ పరువు మరోసారి పోయింది. మునుగోడు సాక్షిగా కాంగ్రెస్ దీనగోడు లోకానికి తెలిసింది. కాంగ్రెస్ కి మూడవస్థానం దక్కింది. పైగా డిపాజిట్ గల్లంతు అయింది. ఇది నిజంగా బాధాకరం. ఎందుకంటే కాంగ్రెస్ ని మునుగోడులో ఓడించింది ఎవరో కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మునుగోడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ కొట్టారు. ఆ మీదట ఆయన బీజేపీలోకి వెళ్ళి పోటీ చేశారు.

ఆ పార్టీకి 86 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. అంటే అవన్నీ కూడా కోమటిరెడ్డికి పడిన ఓట్లుగానే చూడాలి. ఇంకా చెప్పాలీ అంటే ఆయనతో పాటే సగానికి పైగా వెళ్ళిపోయిన కాంగ్రెస్ క్యాడర్ వేయించిన ఓట్లుగా చూడాలి. అలా లెక్క తీస్తే కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి వచిన పాతిక వేల ఓట్లు రాజగోపాల్ రెడ్డి ఓట్లు కలుపుకుంటే మునుగోడులో టీయారెస్ మీద కాంగ్రెస్ ఏకంగా పదిహేను వేల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు.

కానీ అలా జరగలేదు కదా. కాంగ్రెస్ విడిపోయి ఓట్లు చీల్చుకుంది. నేతలు కూడా సరిగ్గా ప్రచారం చేయక పార్టీకి నష్టం చేకూర్చారు. ఈ పరిస్థితుల్లో మునుగోడు సాక్షిగా కాంగ్రెస్ మూలనపడి మూలుగుతోంది. అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్ట్లు లేడని ఒక ముతక సామెత. కాంగ్రెస్ పార్టీకి మెరిక లాంటి యువ నాయకత్వం రేవంత్ రెడ్డి రూపంలో ఉంది. ఆయన టీయారెస్ కి ధీటైన పాలిటిక్స్ చేస్తారు. ప్రజాకర్షణ ఉన్న నాయకుడు. ఆయన ప్రసంగాలు కూడా జనాలను ఆకట్టుకుంటాయి.

కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయనే సీఎం అవుతారు అని భయపడుతున్న వారు మనకెందుకులే అని భావిస్తున్న వారు, కాంగ్రెస్ లో నైరాశ్యంలో ఉంటున్నారు. ఇక గెలవదులే అని తామే జోస్యం చెప్పేసి పార్టీకి పడకేయించేస్తున్న వారు ఇలా అంతా కలసి కాంగ్రెస్ ని పతనావస్థకు చేర్చేశారు అని అంటున్నారు. అయితే దీనికి బీజాలు ఎపుడో పడ్డాయని కూడా విశ్లేషించాల్సి ఉంది. కాంగ్రెస్ ని వైఎస్సార్ రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు. నాడు టీడీపీ చేసిన తప్పులు కూడా కాంగ్రెస్ కి ఉపయోగపడ్డారు.

ఆ విధంగా కేంద్ర నాయకత్వం ఉమ్మడి ఏపీని వైఎస్సార్ చేతిలో పెడితే ఆయన కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని తనకు అనువుగా మార్చుకుని ఏపీ వరకూ ఒక ప్రాంతీయ పార్టీగా మార్చేశారు అని చెప్పుకునేవారు. ఆయన పోయాక ఆ ప్రాంతీయ పార్టీలోని తన వాటా కోసం జగన్ సహా వైఎస్సార్ కుటుంబం చేసిన యుద్ధం కారణంగా ఏపీలో కాంగ్రెస్ మొత్తానికి మొత్తం వైసీపీ వైపుగా జరిగిపోయింది. దాంతో అక్కడ కాంగ్రెస్ ఆశలు అలా గల్లంతు అయ్యాయి.

ఇక తెలంగాణా మిగిలింది. పోనీ ఇక్కడ ఏమైనా చూద్దామనుకుంటే  బలమైన నాయకులు ఉన్నారు. 2014లోనే అధికారంలోకి రావాల్సి ఉంది. తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకోలేక నేతలు చతికిలపడ్డారు. దాంతో టీయారెస్ అధికారంలోకి వచ్చి తన బలాన్ని బాగా పెంచుకుంది. ఇక రెండవసారి కూడా టీయారెస్ గెలవడంతో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. 2023 ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా గట్టిగా లేదు. అదే టైం లో కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాదె పడేస్తున్నారు.

కాంగ్రెస్ కి గట్టి పట్టున్న నల్గొండ జిల్లాలో ఇపుడు ఇలా జరిగింది. దీనికి ముందు దుబ్బాక, హుజూరాబాద్ లో కూడా డిపాజిట్లు పోయాయి. నాగార్జునసాగర్ లో మాత్రమే కాంగ్రెస్ టీయారెస్ కి గట్టి పోటీ ఇచ్చింది. మరి ఇదే రకంగా కాంగ్రెస్ సాగితే రేపటి ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో అన్న చర్చ అయితే ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ ని అధికారంలోకి తేవాలని కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. తెగ ఆరాటపడుతున్నారు.

కానీ ఆయన ఒక్కరే అనుకుంటే సరిపోదు కదా. మా కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచన ప్రతీ నాయకుడిలో ఉండాలి. కానీ విషాదం ఏంటి అంటే అంతా కూడా సీఎం తమకు తాముగా క్యాండిడేట్లుగానే చెప్పుకుంటున్నారు. ఆలూ లేదొ చూలూ లేదు అన్నట్లుగా ముందుగానే సీఎం పోస్టు కోసం రేసులోకి వస్తారు. ఇదే కాంగ్రెస్ కి దెబ్బ తీస్తోంది. బలముండి కూడా ఓడిపోతోంది. అలా కాంగ్రెస్ ని కాంగ్రెస్ ఓడించుకుంటూంటే ఇక ఫ్యూచర్ లో తెలంగాణాలో ఆ పార్టీ జెండా ఎగురుతుందా అంటే ఆలోచించాల్సిన విషయమే మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News