రైలు పట్టాలపై పడ్డ చిన్నారి ... దూసుకొస్తున్న రైలు .. క్షణాల్లోనే !

Update: 2021-04-19 07:16 GMT
ప్రమాదం .. ఎప్పుడు , ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అసలు ఊహించని విధంగా వచ్చే దాన్నే ప్రమాదం అంటాం. మనం ఇంట్లో నుండి బయటకి వచ్చిన క్షణం నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా  రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అయితే శరవేంగా  అక్కడున్న రైల్వే ఉద్యోగి స్పందించడంతో  రెప్పపాటు కాలంలో  ఒక చిన్నారి మృత్యుముఖం నుంచి బయటపడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి  రైల్వే పట్టాలపై పడిపోయింది. అదే క్షణంలో మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీనితో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది.

ఆ రైల్వే స్టేషన్ లో జరిగిన దృశ్యాలు సీసీటీవీలో  రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై  కేంద్ర  రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను  కాపాడటం గర్వంగా ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు
Tags:    

Similar News