ఉరికి రెండు గంటల వరకూ నిర్భయ దోషుల ఆగని ప్రయత్నాలు

Update: 2020-03-20 06:06 GMT
నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఈ ఉదయం ఉరిశిక్ష పడింది. ఏడు సంవత్సరాలుగా కోర్టులు, క్షమాభిక్ష పేరుతో కాలయాపన చేస్తున్న నిర్భయ నిందితుల ఆయువు ఉదయం 5.30 గంటలకు అనంతలోకాల్లో కలిసిపోయింది.

అయితే ఈ నలుగురు నిందితులు ఉరితీయడానికి కొద్ది గంటల వరకూ మరణదండన తప్పించుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. ఉరిశిక్షను తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాల పేరుతో దోషులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఉరిశిక్షకు రెండు గంటల వరకూ దోషులు కోర్టుల చుట్టూ తిరిగారు.

ఢిల్లీ హైకోర్టులో అర్ధరాత్రి వరకూ వాదనలు కొనసాగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషుల చివరి పిటీషన్ ను శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు సుప్రీం కోర్టు కూడా కొట్టవేసింది.

ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అయ్యాక దోషులు పిటీషన్లు వేయడంతో మూడు సార్లు ఉరి వాయిదా పడింది. జనవరి 22న తొలిసారి ఉరికి డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. అనంతరం ఫిబ్రవరి 1న, మార్చి 3న ఉరితీయాలని డెత్ వారెంట్లు జారీ అయినా ఉరి అమలు కాక వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 20న నాలుగోసారి ఉరికి డెత్ వారెంట్ జారీ ఉరి అమలైంది. నిర్భయ కుటుంబానికి న్యాయం జరిగింది.
Tags:    

Similar News