రాజ్ భ‌వ‌న్‌ కు రూ.10కోట్ల టోక‌రా!

Update: 2018-03-01 06:04 GMT
మోసాలు మామూలే. కానీ.. ప్ర‌ముఖులకు టోపీ పెట్టేందుకు సాహ‌సం కావాలి. అంత‌కు మించిన బ‌రితెగింపు ఉండాలి. అవ‌న్నీ పుష్క‌లంగా ఉన్న ఒక వ్య‌క్తి రాజ్ భ‌వ‌న్‌ కే టోపీ పెట్టేశాడు. ఫ‌ర్నీచ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లుగా దొంగ బిల్లులు సృష్టించేసి కోట్లాది రూపాయిలు కొట్టేసిన వైనం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది.

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ కొలువు తీరే రాజ్ భ‌వ‌న్ కు ఫ‌ర్నీచ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లుగా చెబుతూ ఒక వ్యాపార సంస్థ య‌జ‌మాని చేసిన మోసం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చి సంచ‌ల‌నంగా మారింది.  చెన్నై లోని గిండి గ‌వ‌ర్న‌ర్ నివాస‌మైన రాజ్ భ‌వ‌న్ కు అడ‌యార్ లోని ఫ‌ర్నీచ‌ర్ షోరూం య‌జ‌మాని మ‌హ్మ‌ద్ యూన‌స్ ఫ‌ర్నీచ‌ర్ ను కొంత‌కాలంగా స‌ర‌ఫ‌రా చేస్తున్నాడు.  దాదాపుగా ప‌దిహేనేళ్ల నుంచి ఫ‌ర్నీచ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తుంటాడు.

గ‌డిచిన ఐదేళ్లుగా నాసిర‌కం ఫ‌ర్నీచ‌ర్ ను స‌ర‌ఫ‌రా చేయ‌టంతోపాటు.. కొన్ని వ‌స్తువుల్ని స‌ర‌ఫ‌రా చేయ‌కుండానే బిల్లులు పెట్టేసి నొక్కేసిన వైనాన్ని తాజాగా గుర్తించారు. ఇలా రాజ్ భ‌వ‌న్ ను మోసం చేసిన మొత్తం ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర రూ.10 కోట్ల మేర ఉంటుంద‌ని గుర్తించారు.

త‌మిళ‌నాడుకు గ‌వ‌ర్న‌ర్ గా వ‌చ్చిన భ‌న్వ‌రీలాల్ పురోహిత్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ఈ మోసాన్ని గుర్తించారు. వ‌స్తువులు స‌ర‌ఫ‌రా చేయ‌కుండానే న‌కిలీ బిల్లులు స‌మ‌ర్పించి కోట్లు కొట్టేస్తున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మోసంపై గ‌వ‌ర్న‌ర్ డిప్యూటీ కార్య‌ద‌ర్శి శౌరిరాజ‌న్ చెన్నై పోలీసు క‌మిష‌న‌ర్  విశ్వ‌నాథ‌న్‌ కు ఫిర్యాదు చేశారు.  

ఈ నేప‌థ్యంలో రాజ్ భ‌వ‌న్ కు టోక‌రా వేసిన శేఠ్ ఫ‌ర్నీషింగ్స్ షోరూంలో పోలీసులు సోదాలు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా రాజ్ భ‌వ‌న్ కు స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లుగా రూపొందించిన న‌కిలీ బిల్లుల్ని వంద‌ల సంఖ్య‌లో స్వాధీనం చేసుకున్నారు. ఫ‌ర్నీచ‌ర్ షాపు య‌జ‌మాని మ‌హ‌మ్మ‌ద్ యూన‌స్ ను అరెస్ట్ చేశారు.  


Tags:    

Similar News