నెల రోజుల సెలవు పెట్టి వెళ్లిన కానిస్టేబుల్‌.. తీహార్ జైల్లో..

Update: 2019-05-08 10:52 GMT
అతడు కానిస్టేబుల్. సొంతూరు వెళ్లి చాలా రోజులైందని, ఓసారి వెళ్లొస్తానంటూ నెల రోజులు సెలవు పెట్టాడు. అలా వెళ్లిన వాడు నెలలు గడుస్తున్నా పత్తా లేడు. మూడు నెలలు చూశారు.. ఇక లాభం లేదని విధుల నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయితే చేశారు కానీ, వెళ్లిన వాడు ఏమయ్యాడన్న ప్రశ్న ఎస్పీని వేధించింది. వెంటనే డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. రెండు నెలలపాటు కష్టపడి అతడి వివరాలు సేకరించిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఇంతకీ సెలవుపై వెళ్లిన కానిస్టేబుల్ ఎక్కడున్నాడో తెలుసా? తీహార్ సెంట్రల్ జైలులో జీవితకాల శిక్ష అనుభవిస్తూ.. ఉత్తరప్రదేశ్‌ లోని బిజ్నోర్ జిల్లా బాదాపూర్‌ లో జరిగిందీ ఘటన. సంచలనంగా మారిన ఈ కేసులో అదృశ్యమైన ఆ కానిస్టేబుల్ పేరు కన్వర్ పాల్ సింగ్ (55). బాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నాడు. గతేడాది నవంబరు 15న నెల రోజులు సెలవు పెట్టాడు. ఇన్ని రోజుల సెలవులు ఎందుకయ్యా అని పై అధికారులు ప్రశ్నిస్తే సొంతూరు షామ్లి వెళ్తున్నట్టు చెప్పాడు. అలా వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాడే. నెలలు గడుస్తున్నాయి. ఇక, వేచి చూసి లాభం లేదని భావించిన ఎస్పీ అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆపై అతడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటూ డిపార్ట్‌మెంటల్ విచారణకు ఆదేశించారు.

అతడిని అన్వేషిస్తూ బయలుదేరిన పోలీసులకు ఆశ్చర్యకరమై విషయం తెలిసింది. అతడు ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్నాడని. అంతే.. విషయం తెలిసిన ఉన్నతాధికారులు విస్తుపోయారు. జైలులో ఎందుకున్నాడో ఆరా తీస్తే అవాక్కయ్యే మరో విషయం బయటపడింది. కన్వర్ పాల్ సింగ్ యూపీ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ మాజీ కానిస్టేబులట. ఈ విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. మే 22, 1987లో మీరట్‌ లోని హషీంపురా ప్రాంతంలో 42 మంది ముస్లింలను ఊచకోత కోశారు. అనంతరం మృతదేహాలను మీరట్‌ లోని ఓ కాలువలోకి విసిరేశారు. తాజాగా ఈ కేసులో ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెల్లడించింది. మొత్తం 15 మందిని దోషులుగా తేల్చిన కోర్టు అందరికీ జీవిత శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ప్రకటించిన 15 మంది దోషుల్లో కన్వర్ పాల్ సింగ్ కూడా ఉన్నాడు. విషయం తెలియడంతో ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడిని తీహార్ జైలుకు తరలించారు. ఇదన్న మాట కానిస్టేబుల్ అదృశ్యం వెనక ఉన్న అసలు కథ. విషయం తెలిసి విస్తుపోవడం పోలీసుల వంతైంది.

Tags:    

Similar News