సీఎంగారికి కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది

Update: 2016-09-17 04:41 GMT
పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామికి భ‌లే చిక్కొచ్చి ప‌డింది. సీఎం పీఠం ఎక్కిన‌ప్ప‌టికీ ఎమ్మెల్యే కాక‌పోవ‌డంతో ఇపుడు ఆ స్థానం గెలవాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది. ఈ నేపథ్యంలో ఆయన పోటీచేయనున్న స్థానం, అందుకు రాజీనామా చేయ‌నున్న ఎమ్మెల్యేపై ఇప్పటివరకు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్‌ కుమార్ తాజాగా తన రాజీనామా పత్రాన్ని అందించడంతో ఆ నియోజకవర్గం నుంచి నారాయణస్వామి పోటీచేయడం ఖరారైంది.

పుదుచ్చేరిలోని 30 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 15  - ఎన్‌.ఆర్‌.కాంగ్రెస్‌-8 - అన్నాడీఎంకే-4, డీఎంకే-2 - స్వతంత్రులు-1 స్థానాల్లో గెలవగా.... డీఎంకే మద్దతుతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీచేయని నారాయణస్వామిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించడంతో జూన్‌ 6న ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే 3 నెలల్లోపు ఆయన ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి గెలవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో నారాయణస్వామి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఆయన కోసం ఏ స్థానం ఖాళీ అవుతుందోననే ఉత్కంఠ కొద్ది రోజులుగా నెలకొంది. ఈ నేపథ్యంలో నారాయణస్వామికి అత్యంత సన్నిహితుడు - నెల్లితోప్పు ఎమ్మెల్యే జాన్‌ కుమార్‌ ఉదయం తన రాజీనామా లేఖను శాసనసభ సభాపతికి సమర్పించారు.

అనంత‌రం జాన్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో పోటీచేయడం ద్వారా అక్కడి ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు సమకూరనున్నాయని చెప్పారు. నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందనుందని తెలిపారు. సభాపతి వైద్యలింగం మాట్లాడుతూ... ఎమ్మెల్యే జాన్‌ కుమార్‌ రాజీనామా గురించి పుదుచ్చేరి ఎన్నికల విభాగానికి తెలియజేస్తానన్నారు. తర్వాత దిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌ దీనిపై ప్రకటించనుందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మూడు నెల‌లకే వ‌చ్చిపడిన ఉప ఎన్నిక ఇపుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News