రోడ్డుపక్కన నమాజ్ చేశారని గుంజీలు తీయించారు.. కేసు నమోదు

Update: 2022-09-15 07:38 GMT
యూపీలో రోడ్డుపక్కన నమాజ్ చేస్తున్న యాత్రికులతో గుంజీలు తీయించిన ఘటన వైరల్ అయ్యింది. దీనిపై సీరియస్ అయిన పోలీసులు గుంజీలు తీయించిన విశ్వహిందూ పరిషత్ నాయకులతో క్షమాపణలు చెప్పించి మరీ పోలీస్ స్టేషన్ తరలించారని అంటున్నారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..  ఉత్తరప్రదేశ్ లోని శహజాన్ పూర్ జిల్లా తిల్లార్ లో రోడ్డు పక్కన నమాజ్ చేస్తున్న ముస్లిం యాత్రికులతో గుంజీలు తీయించారని   విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.  అజ్మీర్‌కు వెళ్తున్న ముస్లిం యాత్రికులు నమాజ్ టైం కావడంతో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకొని రోడ్డుపక్కనే నమాజ్ చేశారు. అయితే వారిని విశ్వహిందూపరిషత్ నాయకులు అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది.  ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్అవుతోంది.  కొంతమంది పురుషులు క్షమాపణ చెప్పుతూ చెవులు పట్టుకొని గుంజీలు తీస్తున్న ఆ వీడియోలో  కనిపించింది.

పశ్చిమ బెంగాల్ నుంచి రాజస్థాన్ వెళుతున్న  యాత్రికులు తమ బస్సును రోడ్డు పక్కన ఉన్న తినుబండారం దుకాణం వద్ద నిలిపివేశారు. అక్కడే నమాజ్ చేస్తున్న యాత్రికులను వీహెచ్.పీ నాయకులు అడ్డుకున్నారు. 'ఉత్తరప్రదేశ్‌లో బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ అనుమతించబడదని మీకు తెలుసా' అని యాత్రికులను ప్రశ్నించారు. తాము  పశ్చిమ బెంగాల్ నుండి అజ్మీర్ దర్గాకు వెళుతున్నామని.. తమకు ఈ విషయం తెలియదని వాళ్లు సమాధానమిచ్చారు.   ఇది ఉత్తరప్రదేశ్ అని.. ఇక్కడి చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ వీహెచ్.పీ కార్యకర్తలు ప్రయాణికులను గుంజీలు తీయించారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

దీనిపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ వాజ్‌పేయి మాట్లాడుతూ “అజ్మీర్‌కు వెళ్తున్న 18మందిని ఆదివారం రాత్రి రోడ్డు పక్కన నమాజ్ చేస్తున్నారనే గుంజీలు తీయించారు. బాధితులు ఈ మేరకు. వీహెచ్.పీ నేతలపై ఫిర్యాదు చేశారు.దీంతో వీహెచ్.పీ నేతలను తిల్హార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చాం లిఖితపూర్వకంగా బాధితులకు క్షమాపణలు చెప్పించారు. అనంతరం ముస్లిం యాత్రికులకు చలాన్ జారీ చేసి పంపించామని' ఆయన పిటిఐకి తెలిపారు. అదనపు ప్రయాణికులను తీసుకెళ్లినందుకు డ్రైవర్‌కు పోలీసులు జరిమానా విధించారు. బస్సును రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు బయలుదేరడానికి అనుమతించారు.

ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక వీహెచ్‌పీ నాయకుడు రాజేష్ అవస్తీ మాట్లాడుతూ "నేను ఎక్కడికో వెళుతుండగా రోడ్డుపక్కన నమాజ్ చేస్తున్న వ్యక్తులను చూశాను." వారు యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఉన్నారని, అక్కడ బహిరంగంగా నమాజ్ చేయడం నిషేధించబడిందని అవస్తి తెలిపారు.

జూలైలో ఉత్తరప్రదేశ్ పోలీసులు లక్నోలోని లులు మాల్‌లో నమాజ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తుల గుంపుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై ఓ హిందూ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హనుమాన్ చాలీసా పఠించేందుకు అనుమతి కోరింది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 153-ఎ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) ,295-ఎ (మత భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యపూర్వక చర్య) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా యూపీలో బహిరంగంగా నమాజ్ చేసిన ముస్లింలకు చలాన్ వేసి పంపించారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్టు జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News