ఐ-టీడీపీకి ఫైనాన్స్ ఇచ్చేది ఎవ‌రు?

Update: 2022-09-14 14:30 GMT
ఐ-టీడీపీ... ఈ మాట త‌ర‌చుగా ఏపీ రాజ‌కీయాల్లో వినిపిస్తూనే ఉంది. ఏపీ వైసీపీ ప్ర‌భుత్వాన్ని డిజిట‌ల్ మీడియా వేదిక‌గా ఆడేసుకుంటున్న ఐ-టీడీపీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి చెందిన కీల‌క‌మైన డిజిట‌ల్ ప్లాట్ ఫాం. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్ట‌ర్‌, యూట్యూబ్‌.. ఇలా.. ఒక‌టేమిటి.. డిజిట‌ల్ రంగంలో ఉన్న అన్ని మాధ్య‌మాల్లోనూ.. ఐ-టీడీపీ చాలా చురుగ్గా  ఉంది. టీడీపీ అదినేత చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌సంగాలు.. గ‌త స‌ర్కారు చేసిన అభివృద్ధి, టీడీపీ నేత‌ల ప్రెస్ మీట్లు, చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ప్ర‌సంగాలు.. ఇలా అన్నింటినీ.. ప్ర‌జ‌ల్లోకి నిముషాల వ్య‌వ‌ధిలోనే ఈ ఐటీడీపీ చేర‌వేస్తోంది.

మ‌రోవైపు. వైసీపీ స‌ర్కారును విమ‌ర్శ‌ల‌తో చీల్చి చెండాడంలోనూ.. ఐ-టీడీపీ చాలా చాలా ఫాస్టుగా ఉంది. గ‌త స‌ర్కారు చేసిన అభివృద్ధిని.. ప్ర‌స్తుత స‌ర్కారుతో పోల్చి పోస్టులు పెట్ట‌డం నుంచి మీమ్స్‌, కామెంట్లు, ఫొటోలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ.. వైసీపీపై ఒక‌రకంగా విమ‌ర్శ‌ల యుద్ధాన్నే చేస్తోంది. రాష్ట్రంలో ఈ ఐటీడీపీని ప్ర‌త్యేకంగా చూస్తున్న చంద్ర‌బాబు ఇటీవ‌లే.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఐ-టీడీపీ ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఇక‌, జిల్లాల‌కు ఏకంగా ఐఐటీ చ‌దువుకున్న వారిని నియ‌మించారు.

అధికారంలో ఉన్నప్పుడే.. దీనిని బ‌లోపేతం చేశారు. అంతేకాదు.. ఐ-టీడీపీకి విదేశాల్లోనూ.. విభాగాలు.. మ‌ద్ద‌తుదారులు.. కార్య‌క‌ర్త‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. క‌ట్ చేస్తే.. ఇటీవ‌ల వైసీపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియోకు సంబందించి.. కొన్ని రోజుల కింద‌ట‌.. తీవ్ర వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. ఈ న్యూడ్ వీడియోను.. ఐ-టీడీపీ విభాగ‌మే వైర‌ల్ చేసింద‌నేది ఎంపీ మాధ‌వ్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇటీవల ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

దీంతో చంద్ర‌బాబు స‌హా.. నారా లోకేష్‌, చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడి కుమారుడు విజ‌య్ స‌హా ప‌లువురిపై సీఐడీ కేసులు న‌మోదు చేసింది. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంది. ఇదిలావుంటే.. అస‌లు ఐటీడీపీ విష‌యాన్ని తేల్చేయాల‌ని.. వైసీపీ నాయ‌కులు నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఐ-టీడీపీకి నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌నే విష‌యంపై దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఐటీడీపీలో ప‌నిచేస్తున్న ఉన్న‌త స్థాయి ఉద్యోగుల‌కు రూ.70 వేల నుంచి క‌నీస జీతం 25 వేల వ‌ర‌కు ఉంది.

ఈ క్ర‌మంలో వారికి అంత పెద్ద మొత్తంలో జీతాలు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌నే విష‌యంపైనా వైసీపీ నాయ‌కులు క‌న్నేశారు. అంతేకాదు.. ఆయా జీతాల కోసం.. నెల‌కు  రూ.4 నుంచి 5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు గుర్తించారు. ఇదే స‌మ‌యంలో ఒక అకౌంట్ నుంచి కాకుండా.. ప‌లు అకౌంట్ల నుంచి వీరికి జీతాలు అందుతున్న‌ట్టు వైసీపీ నేత‌లు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. ఈక్ర‌మంలో అస‌లు ఆయా నిధులు అంత పెద్ద మొత్తంలో ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌నే విష‌యంపై ఆరా తీస్తున్నార‌ట‌.

ఈ క్ర‌మంలో హ‌వాలా నిధుల‌ను ఇలా ర‌ప్పిస్తున్నారా.. దీనిలో మ‌నీలాండ‌రింగ్ జ‌రుగుతోందా? అనే విష‌యంపైనా దృష్టి పెట్టార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ వారు.. ఈడీకి ఫిర్యాదు చేయాల‌ని చూస్తున్న‌ట్టు పార్టీలో చ‌ర్చ న‌డుస్తోంది.  వైసీపీ ఇప్పుడు ఈ ప‌నిమీదే ఉంద‌ని.. త్వ‌ర‌లోనే నిజానిజాలు తేల్చి.. పక్కా ఆధారాల‌తో ఐటీడీపీని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని టాక్‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News