ఆ నిర్ణయంతో కాంగ్రెస్‌ నెత్తిన పాలుపోసిన బీజేపీ!

Update: 2022-11-16 15:30 GMT
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే గుజరాత్‌ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాల సొంత రాష్ట్రం కావడమే ఇందుకు కారణం.

గుజరాత్‌లో గత 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీకి డిసెంబర్‌ 1, 5 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగునున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అధికారం సాధించడానికి కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ఇటీవల మోర్బీలో వేలాడే తీగల వంతెన తెగి 135 మంది మృతి చెందిన వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాజాగా గుజరాత్‌ హైకోర్టు ఈ కేసును సుమోటోగా విచారిస్తూ అధికారుల తీరును తూర్పారబట్టింది. దీంతో బీజేపీ ఇరకాటంలో పడింది.

మరోవైపు ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న 38 మందికి టికెట్లు నిరాకరించింది. ఇందులో ఏకంగా ఐదుగురు మంత్రులు, శాసనసభ స్పీకర్‌ ఉండటం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి సీటు దక్కకపోవడం విశేషం.

టికెట్లు దక్కని 38 మంది ఈసారి పోటీకి సుముఖంగా లేరని.. అందుకే టికెట్లు ఇవ్వలేదని బీజేపీ చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితి అలా లేదని అంటున్నారు. టికెట్లు దక్కని ఈ 38 మంది అసమ్మతి నేతలుగా మారుతున్నారని సమాచారం. కొంతమంది రెబల్‌ నేతలుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మరికొందరు ప్రత్యర్థి పార్టీలకు చెందినవారిని గెలిపించి బీజేపీని చావుదెబ్బ కొట్టాలని చూస్తున్నారని టాక్‌.

బీజేపీలో ఉన్న ఈ అసమ్మతిని క్యాష్‌ చేసుకోవడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉంది. బీజేపీలో ఉన్న అసమ్మతి, రెబల్స్‌ బెడద తమకు లబ్ధి చేకూర్చగలదని ఆ పార్టీ యోచిస్తోంది.

మరోవైపు మోర్బీలో వేలాడే తీగల వంతెన కూలిన ఘటనకు సంబంధించి మృతులు కుటుంబాలు, ప్రజల్లో బీజేపీపై అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. అదేవిధంగా కోర్టు సైతం ప్రభుత్వ తీరును తప్పుబట్టడంపై ఈ అంశాన్ని కూడా కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోంది.

ఓవైపు బీజేపీలో అసమ్మతి నేతలు, రెబల్స్, మరోవైపు మోర్బీ విషాద ఘటన, ఇంకోవైపు గత 25 ఏళ్లు నుంచి బీజేపీనే అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రజలలో ఉండే అసంతృప్తి తమను విజయతీరాలకు చేరుస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆశలు పెట్టుకుంది.

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, అన్ని వర్గాలకు సమాన న్యాయం కాంగ్రెస్‌ పాలనతోనే జరుగుతుందని విస్తృత ప్రచారం చేస్తోంది. అలాగే మోర్బీ విషాద ఘటనకు బీజేపీ ప్రభుత్వమే కారణమని కార్నర్‌ చేస్తోంది.

అందులోనూ మొత్తం 182 సీట్లలో ఎస్టీలు, ముస్లింలు దాదాపు 42 స్థానాల్లో చక్రం తిప్పుతున్నారు. ఈ 42 నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఎస్టీలు, ముస్లింలే కావడం గమనార్హం. వీరంతా ఈసారి కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా బరిలో ఉన్నా ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం లేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో కాంగ్రెస్‌ అధికారం సాధించడం ఖాయమనే అంచనాలు ఏర్పడుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News