బురిడీ బాబా చేతికి చిక్కిన హైద‌రాబాద్ యువ‌తి.. 47 ల‌క్ష‌ల‌కు టోక‌రా!!

Update: 2022-10-21 00:30 GMT
47 ల‌క్ష‌లు! ఔను అక్ష‌రాలా న‌ల‌భై ఏడు ల‌క్ష‌లు. వీటిని సంపాయించాలంటే.. సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి పవారికి ఎంత స‌మ‌యం ప‌డుతుందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. మోసాలు చేయ‌డంలో దిట్ట‌లుగా మారుతున్న `బాబాలు` ప్ర‌జ‌ల జేబులు కొల్ల‌గొడుతున్నారు. మాయ మాట‌లు.. మంత్రాలతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు. ఇలా.. ఓ బాబాకు చిక్కిన హైద‌రాబాద్ యువ‌తి.. ఆబాబా మాట‌లు న‌మ్మి 47 ల‌క్ష‌లు పోగొట్టుకున్నారు. తీరా మోస‌పోయాన‌ని తెలుసుకున్నాక‌.. ఇప్పుడు ల‌బోదిబో మంటున్నారు.

విష‌యం ఏంటంటే..

హైద‌రాబాద్‌కు చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. జాతకాలు, పూజలపై నమ్మకం ఉంది. అయితే.. కొన్నాళ్లుగా ఆమె వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు.(బ‌హుశ వివాహం కావొచ్చు లేదా.. ప్రేమ కావొచ్చు). దీంఓ ఆ స‌మ‌స్య‌ పరిష్కారం కోసం ప్రత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ (ఇన్‌స్టాగ్రామ్‌)లో వచ్చిన ఓ యాడ్ కు ఆక‌ర్షితురాలైంది. ``మీ స‌మ‌స్య‌ల‌కు ఖ‌చ్చిత‌మైన ప‌రిష్కారం చూపుతాం`` అన్న యాడ్‌తోఆమె.. ఇంకేముంది.. త‌న స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని అనుకుంది.

వెంట‌నే.. యాడ్‌లో ఇచ్చిన  ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించింది. అది ఉత్తరాదిలో ఉన్న ఘజియాబాద్‌ సమీపంలోని షహద్ర ప్రాంతం. ఇక్క‌డ గోపాల్‌ శర్మగా చెప్పుకున్న అతను తొలుత ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఏదో పరిశీలనలు చేస్తున్నట్లు చెప్పాడు. చివరకు జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని, నివారణ పూజలు చేసి సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి, ఇతర ఖర్చులకు రూ.32 వేలు చెల్లించాలని కోరాడు. ఇలా మొదలెట్టిన అతగాడు దఫదఫాలుగా రకరకాల పేర్లు చెప్పి డబ్బు దండుకున్నాడు.

పూజ మొదలెట్టానని, సామాగ్రి ఖరీదు చేయడానికని, ఆపై మరికొన్ని సామాన్లు కొనాలంటూ కారణాలు చెప్పాడు. ఆపై ఆమెను సంప్రదించిన బాబా పూజ మధ్యలో ఆగిందంటూ చెప్పాడు. అలా ఆగిపోతే విషాదం జరుగుతుందని, ఆనారోగ్యం పాలవుతావని భయపెట్టాడు. మొత్తంగా ఆమె నుంచి రూ.47 లక్షలు వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ఆమె యూపీఐతో పాటు రెండు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసింది. ఓ సందర్భంలో పూజ పూర్తి చేయడానికంటూ కొంత మొత్తం డిమాండ్‌ చేశాడు. మరుసటి రోజు ఉదయానికి ఆ డబ్బు పంపాలన్నాడు. ఆమె నగదును ఆ రోజ సాయంత్రానికి బదిలీ చేయగా... టైమ్‌ దాటాక పంపడంతో పూజ తంతు కాలేదని, మళ్ళీ అంతే మొత్తం పంపాలన్నాడు.

చివరకు తాను మోసపోయానని తెలుసుకుంది. దీంతో బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు బాధితురాలు నగదు బదిలీ చేసిన యూపీఐ ఖాతా నెంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. షహద్ర ప్రాంతానికి చెందిన బురిడీ బాబాలను పట్టుకోవడం పెద్ద సవాల్‌గా మారుతోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయం కోరితే విషయం నిందితుడికి చేరుతుంది. అలా కాకుండా నేరుగా దాడి చేస్తే గ్రామం మొత్తం దాడులకు పాల్పడతారని చెప్తున్నారు. ఈ బురిడీ బాబాలు చేసిన వాటిలో వెలుగులోకి రాని మోసాలు అనేకం ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News