వారంతా లోకేష్‌ పాదయాత్రకు వస్తే మంచి బూస్టేనా?

Update: 2023-01-19 08:30 GMT
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఏపీలో 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు లోకేష్‌ పాదయాత్ర చేస్తారు. ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు లోకేష్‌ పాదయాత్ర చేయనున్నారు.

జనవరి 27 నుంచి మొదలయ్యే లోకేష్‌ పాదయాత్రను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుప్పంలో మొదలయ్యే ప్రారంభ కార్యక్రమానికి టీడీపీ ముఖ్య నేతలు, 175 నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు హాజరుకావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు.

అలాగే ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి కూడా ప్రారంభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కుటుంబంలో మొత్తం ఏడుగురు కొడుకులు, నలుగురు కుమార్తెల్లో జీవించి ఉన్నవారు, అలాగే వారి సంతానం సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ నటులు జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్, తారకరత్న తదితరులు హాజరయ్యేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇక ఎలాగూ నందమూరి బాలకృష్ణ ఉండనే ఉంటారు.

తద్వారా నందమూరి కుటుంబానికి, చంద్రబాబు కుటుంబంతో సఖ్యత లేదని వైసీపీ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

తద్వారా లోకేష్‌ పాదయాత్రకు ఆరంభంలోనే అద్భుతమైన ప్రచారం కల్పించాలని చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారని తెలుస్తోంది. అలాగే పాదయాత్ర సాగే మార్గాలు, లోకేష్‌ భద్రత పై ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు, వలస కూలీలు, కూలీలు, విద్యార్థులు, మహిళలు, ఇలా అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపేలా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పాదయాత్రను ప్రతి రోజూ స్వయంగా చంద్రబాబు సమీక్షిస్తారని అంటున్నారు. ప్రతి రోజూ టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించడం, నేతలకు సూచనలు చేయడం చేస్తారని తెలుస్తోంది.

కాగా లోకేష్‌ పాదయాత్ర జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు కుప్పంలోనే సాగుతుందని చెబుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఎక్కడికక్కడ సమావేశాలు కూడా ఉండేలా టీడీపీ ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర మీడియాతోపాటు జాతీయ మీడియాలోనూ లోకేష్‌ పాదయాత్రకు పెద్ద ఎత్తున కవరేజీ లభించేలా ఏర్పాట్లు చేసిందని సమాచారం.

ఈ పాదయాత్ర నారా లోకేష్‌ రాజకీయ జీవితానికి కీలకం కావడంతో విజయవంతం చేసేందుకు టీడీపీ సర్వ జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న లోకేష్‌ పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News